Sunday, March 27, 2011

జై భోలో తెలంగాణా

తెలంగాణ బతుకుచిత్రం!
February 10th, 2011
*** జై బోలో తెలంగాణ (బాగుంది)
తారాగణం: జగపతిబాబు, స్మృతీఇరానీ సందీప్,
మీరానందన్, గౌరీశంకర్, వేదకుమార్, శివారెడ్డి
దేశపతి శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మయ్య , డా.శ్రవణ్ తదితరులు.
కెమెరా: టి.సురేందర్‌రెడ్డి
సంగీతం: చక్రి
నిర్మాణం: మహాలక్ష్మి ఆర్ట్స్
కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: ఎన్.శంకర్
ఉద్యమాల పురిటిగడ్డలో ఉరకలెత్తే ఉత్సాహంతో సరికొత్తగా వచ్చిన ప్రజా ఉప్పెన ప్రత్యేక తెలంగాణ పోరాటం. గత దశాబ్దంగా ప్రజావాణితో బాటు, రాజకీయ సంక్షోభాలకు కారణమైన ఉద్యమ తీవ్రత గూర్చి వివరిస్తూ, తెలంగాణా కళాకారుల మమేకంతో జన ప్రవాహంలా సాగిన జనజీవిత వ్యవస్థను అద్దంలో చూపే ప్రయత్నం ఎన్నదగినదే. అయితే ప్రజా నాయకులు రాజకీయ యవనికపై ఈ ఉద్దృత పోరాటానికి ఎంతమంది బావుటాలెత్తారు? వారి ఉద్యమ ప్రస్థానం ఎలా సాగిందీ? అందులో కష్టనష్టాలు, ఒడిదుడుకులు, ఒక ప్రాంతం విడిపోతే ఎవరికి ఖేదం? మరెవరికి మోదం అన్న ప్రశ్నలు వేస్తూ, వాటికి జవాబులు కూడా ఎవరికి వారు చెప్పుకునే స్క్రీన్‌ప్లేతో ‘జై బోలో తెలంగాణ’ చిత్రం ఆసాంతం సాగుతుంది.
‘‘తెలంగాణాలో పుట్టిన ఓ బిడ్డగా నా బాధ్యతగా భావించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. చరిత్రలో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఉత్తేజం, ఉద్వేగం నాలో కలుగుతోంది’’ అని దర్శకుడు ఎన్.శంకర్ తను రూపొందించిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రం గురించి ఇన్నాళ్లుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆ మాటల్లో ఉన్న ఉద్వేగం, బాధ్యత చిత్రంలో ఎంతవరకు ప్రతిబింబించింది. ఎంతవరకూ ప్రతి ఫలించిందీ అంటే థియేటర్లలో డైలాగులకు, పాటలకు వస్తున్న స్పందనంత.
కథలోకెళితే...బందగీ గోపన్న (జగపతిబాబు) కుటుంబం అనేక తరాలుగా తెలంగాణ ఔన్నత్యాన్ని చాటుతూ, నిజాం దొరల ఏలుబడిలో జరిగిన మానవ వనరుల దోపిడీని ప్రశ్నిస్తూ, సంఘానికి బాట చూపేవారు. ఆ క్రమంలో గోపన్న ప్రత్యేక తెలంగాణ అంశంపై ప్రజా ఉద్యమాలు లేవదీసి పోరాడి పోలీసు కాల్పుల్లో అమరుడవుతాడు. అతని భార్య జయమ్మ (స్మృతిఇరానీ) ‘అమ్మఒడి’ అనే ఆశ్రమం స్థాపించి అన్నార్తులకు, అభాగ్యులకు ఆసరాగా ఉంటుంది. జయమ్మ కొడుకు వర్షిత్ (సందీప్)కు తండ్రి, తాతల్లాగే ఆశయం కోసం మరణించడం ఇష్టముండదు. మంచి చదువులు చదువుకొని జీవితంలో స్థిరపడిపోవాలనుకుంటాడు. ఆ క్రమంలో అతడికి విజయవాడ నుంచి ఉద్యోగం నిమిత్తం వచ్చిన సహజ (మీరానందన్) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీస్తుంది. తెలంగాణ అబ్బాయి, సీమాంధ్ర అమ్మాయి మధ్య ప్రేమ అంకురించడం వల్ల వర్షిత్ తన ప్రేమకే ఎక్కువ విలువ ఇస్తాడు. అప్పటికే వర్తమాన తెలంగాణ పోరాట చిత్రం దేశ పటంపై సాగుతుంటుంది. ఈ నేపథ్యంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లిన వర్షిత్‌కు తెలంగాణ పల్లె జనం పడుతున్న కష్టాలు, కన్నీళ్లు తెలిసి వస్తాయి. దాంతో తన ప్రేమను పణంగా పెట్టి ఉద్యమంలోకి దూకుతాడు. ఇలా వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆ జంట ఒకటయ్యారా...ఉద్యమం వారికి ఏమి మిగిల్చింది అనేదే అసలైన క్లైమాక్స్.
సినిమా అంటేనే కొంత కల్పన ఉండాలి. ఉన్నదున్నట్లు చెబితే అది సినిమాటిక్‌గా ఉండదనుకున్నారో ఏమో, ఉద్యమ కథకు ప్రేమకథను ముడిపెట్టారు. కథగా చూస్తే ఇది రొటీన్ ప్రేమకథే. అయితే దర్శకుడు శంకర్ ప్రతిభ అంతా ప్రేమకథని ఉద్యమానికి ముడివెయ్యటంలోనే చూపెట్టాడు. ఉస్మానియా యూనివర్శిటీ కాల్పుల ఘటన, తెలంగాణ కోసం తొలిసారి అమరుడైన శ్రీకాంత్‌చారి మరణం, కెసీఆర్ నిరాహారదీక్ష, తర్వాతి పరిణామాలు, ముఖ్యంగా డిసెంబర్ 9న కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన, తెలంగాణా నేతల పాత్రలు కూడా కథలో మిళితమవడంతో చిత్రం క్లారిటీగా వచ్చింది. నెగెటివ్‌గా చూపెట్టిన తెలంగాణేతర ప్రాంత పాత్రలు కూడా కథలో మిళితమై కథకు నిండుతనం తెచ్చిపెట్టాయి. జానపదబాణీతో గద్దర్ పాట చిత్రానికి ఆయువు పట్టుగా నిలుస్తుంది. అలాగే ‘జై బోలో తెలంగాణ’ అని టైటిల్‌పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఏక పక్షంగా ఉద్యమాన్ని చూపెడతారని అంతా భావించారు. అదే జరిగింది. కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందే లేదు. వాస్తవంగా జరిగిన ముఖ్యమైన సంఘటనలన్నీ చక్కని కూర్పుతో అల్లడం వల్ల ప్రేమకథ ఫ్లేవర్‌ను కొంత తగ్గించే ప్రయత్నమూ చేసారు. అయతే చరిత్రను సినిమాగా రూపొందించడంలో వాస్తవాల్ని ప్రజల ముందుంచడంలో దర్శకుడు మరికొంత కసరత్తు చేయాల్సింది. బందగీ గోపన్న వంటి అమరుడి గురించి చెప్పినా, తెలంగాణ ఉద్యమం ఎందుకు జరుగుతోందన్నది మరింత లోతుగా చెబితే బావుండేది. ఏవీఎస్, జనార్ధన్ మహర్షి కామెడీ ట్రాక్ నవ్వులు కురిపించింది. అక్కడక్కడ కె.సి.ఆర్‌ను చూపి ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని కలిగించారు. తెలంగాణ సంస్కృతిని, ఉద్యమాన్ని అగ్రభాగాన నిలుపుతూ, ప్రజల మనోభీష్టాలకు అద్దం పట్టిన ఈ చిత్రాన్ని తెలంగాణా అభిమానులకేకాక, అందరికీ నచ్చే విధంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు శంకర్ తను అనుకున్నది సాధించినట్లయింది.
నటుల్లో ప్రధాన పాత్ర వేసిన జగపతిబాబు కనిపించింది కొద్ది సమయమైనా, తన ముద్ర వేయగలిగాడు. ఈ క్యారెక్టర్ ఆయన కెరీర్‌కి ఎంతవరకు ఉపయోగపడుతుందనే దానికన్నా, ఈ సినిమాకి మాత్రం జగపతిబాబు కచ్చితంగా వెనె్నముకలా నిలబడ్డారనేది నిజం. సందీప్, మీరానందన్, స్మృతీఇరానీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. గద్దర్ ఒక్క పాటైనా చిత్రం ముగింపు వరకు వెన్నాడేట్లు కనిపించి ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని కలిగించాడు. చిత్రంలోని కొన్ని ఫ్రేమ్‌లు గత కొంత కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు గుర్తుకు వచ్చి కళ్లు చెమర్చేలా చేస్తాయి.
చక్రి సంగీతంలోని పాటలన్నీ బాగా కుదిరాయి. పాటలు రాసింది ఉద్ధండులైన ప్రజాకవులు కావడంతో పాటల్లో మాటలు తూటాల్లా పేలాయ. ముఖ్యంగా అందెశ్రీ రాసిన ‘జైబోలో తెలంగాణ’, నందిని సిద్ధారెడ్డి ‘ఒక పువ్వు ఒక నువ్వు ఉయ్యాల లూగేనా...’, గద్దర్ రచించి ఆడి పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా...పోరు తెలం గాణమా..కోట్లాది ప్రాణమా..’ బాగా ఆకట్టుకున్నాయ. వీరికి తోడు కెసిఆర్ రాసిన ‘జగారడీ చేస్తుండ్రు..గడిబిడి చేస్తుండ్రు..’ పాట ఆయన స్టయల్‌లోనే సాగింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఓకే. డైలాగులు కొన్ని చోట్ల బాగా పేలాయి. ‘తెలంగాణ కోసం ఎన్ని స్విచ్‌లు నొక్కినా ఫలితం లేదు. ఢిల్లీలో కరెంట్ లేదుగా’, ‘కలిసి ఉందా మనుకున్న మమ్మల్ని విడదీస్తున్నారు... విడిపోతాం అంటున్న తెలంగాణాను మాత్రం కలిసి ఉండాలంటు న్నారు. ఇదేం న్యాయం?’ లాంటి డైలాగులకు ప్రేక్షకుల్లో ఈలలే ఈలలు. చప్పట్లే..చప్పట్లు మొత్తానికి దర్శకుడు ఎన్.శంకర్ తాను ఎందుకోసం ఈ చిత్రం తీసాడో, ఆ ధ్యేయం నెరవేరినట్లే.
-md abdul

1 comment:

  1. /మొత్తానికి దర్శకుడు ఎన్.శంకర్ తాను ఎందుకోసం ఈ చిత్రం తీసాడో, ఆ ధ్యేయం నెరవేరినట్లే./:))
    ఏమిటో ఆ మహోన్నత ఆశయాలు! బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడిందని విన్నాను. :P

    ReplyDelete