Thursday, August 11, 2011

తమాషా కార్నర్

‘అయ్యారే...’ శివాజీ!

కాషాయ వస్తధ్రారి నిత్యానందస్వామి నీలి చిత్రాల క్రేజీనటుడయ్యాక, ఆ క్రేజ్‌ని వెండితెరమీద సొమ్ము చేసుకోవాలని ‘అయ్యారే’ తీశారు నిర్మాతలు. నిత్యానంద కోర్టుకెళ్లి స్టేయ్యారే అన్నాడు. స్టే వచ్చింది. సినిమా ఆగిపోయింది. తిరిగి ఎన్నాళ్లకో విడుదలవుతోంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని హీరో శివాజీ అసభ్యశ్రీ అవార్డు పుచ్చుకుందామని టీవీ ప్రేక్షకుల సాక్షిగా ముద్దు ముద్దుగా ముచ్చటగా బూతైన మాటలతో నిత్యానందలహరిలో తేలిపోయాడు. ఎదవ అన్నాడు నిత్యానందని. ఎవరూ వన్స్‌మోర్ అనకున్నా పదే పదే అన్నాడు. ఇంకేదో రాయడానికి వీల్లేని మాటని తనివితీరా అన్నాడు. లోకమంతా షాకై చూస్తోంది. నిత్యానంద నీలి దృశ్యాలకన్నా ఇదే అఫెన్సివ్‌గా ఉంది. సినిమాని ఆపే హక్కు నిత్యానందకి లేదట. సినిమా కోర్టు కదా ఆపింది. నిత్యానంద నీచుడైనంత మాత్రాన అతడికి హక్కులుండవనా శివాజీ భావం? నిత్యానంద లీలల్ని టీవీలో చూసి ఇన్‌స్పయిరై సినిమాలో నటించి శివాజీ, ఇప్పుడదే తను పేల్చిన అసభ్య పదజాలాన్ని నిత్యానంద టీవీలో చూసే ఉంటాడు. అతను శివాజీమీద ఇంకో సినిమా తీస్తే? దాని షూటింగ్ కోర్టులో జరిగితే?

తమిళ ముప్పు!
తమిళ హీరోలు తెలుగు వాళ్ల మధ్యకొచ్చి ప్రెస్‌మీట్లుపెట్టి తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకుంటూ క్రేజ్ పెంచుకోవడం తెలుగు స్టార్ల కొంప ముంచబోతోందా? సూర్య, విక్రమ్, కార్తీ లాంటి తమిళ స్టార్స్‌కి ఇప్పటికే తెలుగులో తెగ ఫాలోయింగ్ ఉంది. ఫాలోయింగ్ లేకపోయినా తమిళ దర్శకులు, ఇతర టెక్నీషియన్లు తెలుగు ఫీల్డులో చొరబడుతూ తెలుగు దర్శకులకి, టెక్నీషియన్స్‌కి గుబులు పుట్టిస్తున్నారు. దీనిమీద సినిమా కథ దగ్గరనుంచీ విడుదల వరకు తాము ఆడింది ఆటగా సాగించుకునే తెలుగు స్టార్లెవరూ స్పందించలేదు. ఇప్పుడు వాళ్ల నెత్తిమీదకే వచ్చింది. ఈ తమిళస్టార్లు ఏవో డబ్బింగులతో క్రేజ్ పెంచుకుంటున్నార్లే అని సరిపెట్టుకుంటున్న తెలుగుస్టార్లు-ప్రత్యేకించి యువస్టార్లు అమాంతం పరస్పరం ఆరాలు తీస్తూ బేజారెత్తుతున్నారు. కారణం, ‘నాపేరు శివ’తో మళ్లీ వచ్చిన తమిళస్టార్ కార్తీ తెలుగులో నటిస్తాననడం! దీనికో నిర్మాతా ముందుకు రావడం! ఇక తమిళస్టార్లు తెలుగులో నటించేస్తే ఇంకేమైనా ఉందా...తెలుగులో వారసత్వాలతో వచ్చిన యువస్టార్లని తప్పించి మరే కొత్త మొహం చూసి తరించే ఛానే్సలేదు. వారసేతర కుర్రాడు స్టార్‌గా ఎదిగే స్కోపే లేదు. కానీ పక్కరాష్ట్రం నుంచి అమాంతం వెరైటీగా క్రేజ్ ఉన్న స్టార్ వచ్చేస్తే? ఇదిప్పుడు యువస్టార్లకి కంగారు పుట్టిస్తోందని ఫిలింనగర్ సమాచారం. ఏదో తప్పుచేస్తూంటేనే కంగారు పుట్టుకొస్తుంది...మూసపాత్రలతో మూస సినిమాలే లోకంగా జీవించడం తప్పే కదా? తమిళ స్టార్ వచ్చేసి ప్రయోగం చేస్తే, తెలుగు ప్రేక్షకులకి ఇష్టంగా వడ్డిస్తున్న పాత చింతకాయ సినిమాలేమైపోవాలి? మూసకి ఈ అన్యాయం జరగాల్సిందేనా! ఇక జీవించడమెలా టాలీవుడ్ తల్లీ?

ఇక డైలాగులు విడుదల!
సినిమా విడుదలవుతోంది. సినిమాకంటే ముం దు టైటిల్‌లోగో విడుదలవుతోంది. తర్వాత పాటలు విడుదలవుతాయి. ఆ తర్వాత ఫస్ట్‌లుక్ అంటూ కొన్ని ఫోటోలు ఫ్యాన్స్ మొహాన పడేస్తారు. స్ప్లెండిడ్,
టెర్రిఫిక్, అదరగొట్టాడు అని స్టార్ ఫోజుల్ని చూసి మురిసిపోతారు ఫాన్స్. పోస్టర్ విడదలవుతుంది. వారెవ్వా అనుకుంటారు. అసలు లోగో విడుదలైనప్పుడు ఈ టైటిల్ డిజైన్ గురించే సినిమా ఎలా ఉండబోతోందో గంటలకొద్దీ చర్చించుకుంటారు. ఇక ఫొటోల తర్వాత టీజర్లు-అంటే ట్రయిలర్స్ అనే వాడుకలో ఉన్న పేరుగా స్టయిలుగా పెట్టుకున్న కొత్త పేరు- విడుదలవుతాయి. ఫస్ట్ టీజర్ విడుదల చేసి, రెస్పాన్స్ చూసి, దానికి మించిన సెకండ్ టీజర్ రిలీజ్ చేస్తారు. ఇందులో అభిమాన స్టార్‌ని చూసి ఫుల్ రేంజిలో రెచ్చిపోతారు. ఈ టీజర్స్‌లో ఒక పంచ్ డైలాగ్ ఉంటుంది. అదే మెయిన్ ఎట్రాక్షన్. టీజర్ల పేరుతో పంచ్ డైలాగులు వినిపించడమే అసలు ఉద్దేశం. అలా ఫస్ట్ టీజర్‌తో ఒక డైలాగు పాపులర్ అయ్యాక, సెకండ్ టీజర్‌లో ఇంకోటి వదులుతారు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్‌బాబు ‘దూకుడు’టీజర్లతో జరుగుతున్నదిదే. ఫస్ట్ టీజర్‌లో ‘మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లయిండ్‌గా వెళ్లిపోతా’ అని పంచ్ ఇచ్చుకున్నాడు ప్రిన్స్. మొనే్న విడుదల చేసిన సెకండ్ టీజర్‌లో ‘్భయానికి మీనింగే తెలీని బ్లడ్‌రా నాది’ అని పంక్చర్ చేశాడు. రాష్ట్రంలో నేలమీద ఉండే కామన్ అభిమానులని అలా ఉంచుదాం, ఇంటర్నెట్‌లో ఉండే ఎక్కడెక్కడి దేశాల నెటిజనులూ ఈ డైలాగులకి తెగ రెచ్చిపోతున్నారు. ఇలా లోగో దగ్గరనుంచీ డైలాగుల వరకూ రెచ్చగొట్టుకుంటూ వచ్చిన నిర్మాతలు తీరా సువిశాల వెండి తెరమీద ఏంచేస్తారో, ఏం తేలుస్తారో తెలీదు! షోలే, ముత్యాల ముగ్గు డైలాగుల్లాగా చరిత్రలో వాటికంటూ ఓ స్థానం రికార్డుల రూపంలో ఉంటుందో లేదో తెలీదు. వెయ్యి థియేటర్లలో రెండు వారాల తర్వత ఈ హడావుడి అంతా సద్దుమణిగి, దులుపుకుని వెళ్లిపోతారు.

Thursday, August 4, 2011

-ఎం.డి.అబ్దుల్

పెద్ద సినిమాలు వస్తున్నాయంటే ఆ హంగామానే వేరు. వసూళ్ల గురించి, సెంటర్ల గురించి, రికార్డుల గురించి మాట్లాడుకునేది అప్పుడే. పరిశ్రమ చూపు ఎప్పుడూ పెద్ద సినిమాలమీదే వుంటుంది. ఓ సినిమా విజయం పరిశ్రమను బతికిస్తుంది. అయితే గత కొంత కాలంగా సరైన హిట్స్‌లేక టాలీవుడ్ విలవిల్లాడిపోతోంది. బాక్సాఫీస్ కళ తప్పింది. ఉద్యమాల పుణ్యమా అంటూ చిత్ర నిర్మాణాల సంఖ్య బాగా తగ్గిపోవడంతో సినిమాలు లేక థియేటర్లు బోసిబోయాయి. ఇక అగ్ర హీరోల చిత్రాల జాడే లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అల్లు అర్జున్ ‘బద్రినాథ్’, ఎన్‌టిఆర్ ‘శక్తి’ తాజాగా బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాన్ని చవి చూశాయి. ఈ దశలో ఇప్పుడు పరిశ్రమ దృష్టి త్వరలో విడుదల కాబోతున్న పెద్ద సినిమాలమీదే నెలకొంది. ముందున్నది సినీ దసరా ముసురు. ఈ ముసురులో దాదాపు 250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రాల విడుదల కోసం ఆయా నటుల అభిమానులే కాదు, థియేటర్లూ ఎదురు చూస్తున్నాయి.

ఇప్పుడు రాబోయే ఐదునెలల కాలం ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తనుంది. క్రేజీ హీరోలు, క్రేజీ దర్శకుల చిత్రాలు కొన్ని విడుదలవుతుండడమే దీనికి కారణం. రామ్ ‘కందిరీగ’, నాగచైతన్య ‘దడ’, మహేష్‌బాబు ‘దూకు డు’, బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’, ఎన్‌టిఆర్ ‘ఊసరవెల్లి’, నాగార్జున ‘రా జన్న’, వెంకటేష్ ‘గంగ-ద బాడీగార్డ్’ రామ్‌చరణ్ ‘రచ్చ’తో పాటు గోపీచంద్ ‘మొగుడు’ విడుదలకు సై అంటూ ప్రేక్షకుల తీర్పును కోరడానికి సిద్ధంగా వున్నాయి. భారీ తారాగణమే కాదు, భారీ పెట్టుబడితో నిర్మించిన ఈ చిత్రాల విషయానికొస్తే... ముందుగా ఈనెల 5న రామ్ హీరోగా నటించిన ‘కందిరీగ’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. వినోదాన్ని పండించడంతో పాటు తనకంటూ ఓ శైలిని ఏర్పరచుకున్న రామ్ తొలి సినిమాతోనే తన నటనలో సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. ‘జగ డం’తో మాస్‌ని మెప్పించాడు. రెడీ, గణేష్, మస్కా చిత్రాలు రామ్‌కు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. ‘రామ రామ కృష్ణ కృష్ణ’ తర్వాత కొంచెం విరామం తీసుకుని ‘కందిరీగ’ చేశాడు. శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్‌పై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా కొన్ని చిత్రాలకు పనిచేసిన సంతోష్ శ్రీనివాస్ ‘కందిరీగ’తో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ‘మస్కా’ తర్వాత రామ్-హన్సిక మరోసారి జోడీగా నటించగా, ‘యువత’ ఫేం అక్ష మరో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు ఎంటర్‌టైన్‌మెంటే బలమైన ఆయుధం. ‘రెడీ’ తర్వాత చెప్పుకోతగ్గ సినిమాల్లేని రామ్ ‘కందిరీగ’తో మంచి విజయాన్ని అందుకోవాలని తపిస్తున్నాడు. రామ్ కెరీర్‌లో ఈ చిత్రం తప్పకుండా ఓ మైలురాయిలా నిలుస్తుందని దర్శకుడు చెబుతున్నారు. ‘100%లవ్’ చిత్రం తర్వాత నాగచైతన్య నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘దడ’ సినిమా కోసం చాలా మందే వేచి చూస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ చిత్రంతో అజయ్ భుయాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఓ అమ్మాయిని ఆపద నుంచి రక్షించే యువకుడిగా నాగచైతన్య ఈ చిత్రం కనిపించనున్నాడు. అమెరికా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా తనకు మాస్ ఇమేజ్ రావడం ఖాయం అని నాగచైతన్య ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాడు. ‘ఖలేజా’ తర్వాత వస్తున్న మాహేష్‌బాబు ‘దూకుడు’కోసం ఆయన అభిమానులే కాదు, చాలా మంది ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఈనెల 26న లేదా సెప్టెంబర్ తొలివారంలో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. సమంత కథానాయిక. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘పోకిరి’ తర్వాత హిట్‌లేని మహేష్‌బాబు ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. ఇక సెప్టెంబర్‌లో బాబాయ్, అబ్బాయిల సినిమాలు ప్రేక్షకుల ముం దుకు రానున్నాయి. అవి బాలకృష్ణ- బాపుల ‘శ్రీరామరాజ్యం’, ఎన్‌టిఆర్ ‘ఊసరివెల్లి’. ‘చూడు...ఒక వైపే చూ డూ..’అంటూ గత ఏడాది ‘సిం హాం’లా గర్జించిన నందమూరి బాలకృష్ణ పౌరుషాన్ని చూసిన ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. అభిమానులు పండగ చేసుకున్నారు. బాక్సాఫీస్ కళకళలాడింది. అదే ఆశతో ఇప్పుడు మళ్లీ ‘శ్రీరామరాజ్యం’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు బాలయ్య. ఇం దులో సీతారాములుగా నయనతార, బాలకృష్ణ నటిస్తున్నారు. అలనాటి అజరామర చిత్రం ‘లవకుశ’కు ఇది రీమేక్. ఈ చిత్రం అటు బాలయ్యకే కాదు, ఇటు నయనతారకు క్రేజీ ప్రాజెక్టేకావడం విశేషం. ఈ చిత్రంపై పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది. భారీ విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం పరిశ్రమలో బలంగా వుంది. ఎన్‌టిఆర్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న మరో మెగామూవీ ‘ఊసరవెల్లి’పై ఎన్నో అంచనాలున్నాయి. సాంకేతిక విషయాల్లో మంచి అవగాహన ఉన్న దర్శకుడు సురేందర్‌రెడ్డి. ‘అతనొక్కడే’ సినిమాలో అతని పనితీరు చూసి ‘అశోక్’లో అవకాశమిచ్చారు ఎన్‌టిఆర్. ఆ సినిమా ఫలితం ఎలా వున్నా, సురేందర్‌రెడ్డి పాటించిన స్క్రీన్‌ప్లే టెక్నిక్ నచ్చడంతో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఎన్‌టిఆర్ క్యారెక్టరైజేషన్ హైలైట్‌గా తెరకెక్కిన ఈ సినిమా ‘కిక్’ తర్వాత సురేందర్‌రెడ్డి సృజనాత్మకశక్తికీ, ఎన్‌టిఆర్ ఇమేజ్‌కీ ఓ పరీక్ష కానుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మిల్క్‌బ్యూటీ తమన్నా హీరోయిన్. ‘రాఖీ’ తర్వాత ఎన్‌టిఆర్‌తో దేవిశ్రీ ప్రసాద్ పనిచేస్తున్న ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్. ‘అదుర్స్’తో యాక్షన్ నుంచి ఎన్‌టిఆర్ వినోదం వైపు వస్తే, ‘కిక్’ తర్వాత సురేందర్‌రెడ్డి కూడా గేరు మార్చాడు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమన్న భారీ నమ్మకంతో ఇద్దరూ వున్నారు. అక్టోబర్‌లో ఇద్దరు సీనియర్ హీరోల చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అవి నాగార్జున నటిస్తున్న ‘రాజన్న’, వెంకటేష్ ‘గంగ-ది బాడీగార్డ్’. ‘రగడ’ వంటి కమర్షియల్ హిట్ , ‘గగనం’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం తర్వాత నటిస్తున్న ‘రాజన్న’ నాగార్జున కెరీర్‌లో మరో కీలకమైన చిత్రం కానుందని పరిశ్రమ చెబుతోంది. 1940-50 నాటి నేపథ్యంలో రజాకార్ల దురాగతాల మీద తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ‘రాజన్న’ అనే పోరాట యోధుని కల్పిత కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వి.విజయేంద్రప్రసాద్ రూపొందిస్తున్న ఈ చిత్రంలోని యాక్ష న్ సన్నివేశాల్ని ఆయన కుమారుడు అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి తెరకెక్కిస్తున్నాడు. స్నేహ నాగార్జునకు జోడీగా నటిస్తున్న ఈ చిత్రం ఇటు నాగార్జునకు, అటు విజేయేంద్రప్రసాద్‌కు మంచి పేరుని తెచ్చిపెట్టి వసూళ్లు సాధిస్తుందన్న గట్టినమ్మకం వారిలో వుంది. ‘తులసి’ సినిమా తర్వాత సరైన విజయం లేక అల్లాడిపోతున్న వెంకటేష్ తాజాగా నటించిన సినిమా ‘గంగ-ద బాడీగార్డ్’. ‘డాన్ శీను’ ఫేం గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్‌పై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ త్రిషకు బాడీగార్డ్‌గా కనిపించనున్నారు వెంకటేష్. మలయాళంలో విజయం సాధించిన ‘బాడీగార్డ్’కు ఇది రీమేక్. ఈ సినిమా ద్వారా మంచి కమర్షియల్ హిట్ లభిస్తుందన్న నమ్మకం వెంకటేష్‌లోవుంది. రామ్‌చరణ్ ‘రచ్చ’ నవంబర్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ‘ఏమైంది ఈవేళ’ ఫేం సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై రామ్‌చరణ్ పట్టుదలతో వున్నాడు. ‘మగధీర’ మెగా విజయం తర్వాత చేసిన ‘ఆరెంజ్’ అట్టర్‌ఫ్లాప్ కావడంతో కలత చెందిన రామ్‌చరణ్ ఈ ప్రాజెక్టుపై ఎంతో శ్రద్ధపెట్టారు. ప్రేమకథతో పాటు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్‌ని పరిచయం చేస్తూ ‘దిల్’రాజు నిర్మిస్తున్న ‘ఓ మై ఫ్రెండ్’ సైతం నవంబర్ లేదా డిసెంబర్ తొలి వారంలో విడుదలకానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సిద్ధార్థ్, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెగా కుటుంబం నుంచి వస్తున్న మరో హీరో చిరంజీవి మేనల్లుడు సాయి ధరంతేజ్ నటిస్తున్న ‘రేయ్’కూడా విడుదలకు సిద్ధమవుతోంది. స్వీయ నిర్మాణంలో బొమ్మరిల్లు పతాకంపై వై.వి.ఎస్.చౌదరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘దేవదాసు’ చిత్రం తర్వాత తీసిన చిత్రాలన్నీ అట్టర్‌ఫ్లాపై అటకెక్కడంతో వైవిఎస్ ఈ సినిమాపై ఎంతో శ్రద్ధపెట్టాడు. శుభ్ర అయ్యప్ప హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం హీరో సాయికి మంచి పేరు తెచ్చిపెడుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటి వరకూ యాక్షన్ సినిమాతో మగాడిగా కనిపించిన గోపీచంద్ డిసెంబర్‌లో ‘మొగుడు’గా దర్శనమివ్వబోతున్నాడు. తాప్సీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తుండగా, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణవంశీ అంటే కుటుంబ బంధాలు, అందులోని భావోద్వేగాలకు పెద్ద పీట వేసే సంగతి తెలిసిందే. అయితే గోపీచంద్ శైలి వేరు. ఆయన నుంచి ప్రేక్షకులు యాక్షన్‌తో కూడిన సినిమాలను ఆశిస్తారు. ఈ రెండూ కలగలిపి ఈ చిత్రం వుంటుందని దర్శకుడు చెబుతున్నాడు. ఇదే డిసెంబర్‌లోనే లారెన్స్ దర్శకత్వంలో కృష్ణంరాజు, ప్రభాస్ నటిస్తున్న ‘రెబల్’, శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘్ఢమరుకం’, పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘కాళీ’లు కూడా విడుదల కానున్నాయి.
సినిమా సినిమాకీ పెరిగిపోతున్న అంచనాల భారం మోయడం ఎవరికైనా తలకు మించిన పనే! ప్రతి సినిమాకీ అభిమానుల ఆశల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రేక్షకుల్ని మెప్పించాలి. వాళ్లకు కావల్సిన అంశాలను మేళవిస్తూనే కథలను ఎంచుకోవాలి. అన్ని సార్లూ ఈ ఫార్ములా పనిచేయకపోవచ్చు. కానీ కథానాయకుడిగా తన మీద పెట్టి బాధ్యతను మాత్రం నూటికి నూరుపాళ్లూ నెరవేర్చడమన్నది కథానాయకుడికి వుండాల్సిన లక్షణం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నిర్మించిన చిత్రాలే బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తాయి. ఈ అంశాలను విస్మరించిన చిత్రాలు టపా కట్టేస్తాయి. ఇలా ఇప్పుడు భారీ పెట్టుబడులతో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రాల్లో ఎన్ని విజయాన్ని సాధించి పరిశ్రమకు ఊపిరిపోస్తాయో, మరెన్ని అపజయాల పాలై నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతాయో చూడాల్సిందే. *

తమాషా కార్నర్

‘సెగ’ తగిలింది!

యువస్టార్ నాని నిర్మాతలతో ‘అష్టాచెమ్మా’ ఆడుకుంటున్నట్టుంది. అవును మరి, కాలం కలిసి వస్తే కావలసిన వాళ్లు కోన్‌కిస్కా అయిపోతారు. ఏ ముహూర్తాన ‘ఈగ’వచ్చి తన మీద వాలిందో, నిర్మాతలు దోమలై పోతున్నారు. ‘అలా.. మొదలైంది’వరకూ తన సినిమాల బడ్జెట్ మూడు కోట్లలోపే. దీన్ని ఎస్.ఎస్.రాజవౌళి ‘ఈగ’తో పది కోట్లకి పెంచినట్టు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నాని పదికోట్లకి తక్కువ బడ్జెట్ సినిమా చెయ్యనంటున్నాడు. అబ్బాయికి మంచి మార్కెట్ వుంది. చిన్న నిర్మాతలకి చేతులనిండా కలెక్షన్లు తెచ్చిపోస్తాడనుకుని కులుకుతూ వెళ్తే, తేరుకోలేని షాకిస్తున్నాడు. సరే, బడ్జెట్లగోల అలా వుంచితే, తాజాగా పారితోషికాల పరేషానీ తెచ్చాడని చెప్పుకుంటున్నారు ఫిలింనగర్లో. విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘అలా...మొదలైంది’కి 20 లక్షలు తీసుకుంటే, ‘ఈగ’కి 50 లక్షలు ముట్టాయి. అయితే ఎప్పుడైతే ‘అలా..మొదలైంది’ హిట్టయిందో, ఇక కోటి కావాలని కంగారు పుట్టించేస్తున్నాడు. తాజాగా విడుదలైన ‘సెగ’ పరాజయంతో అబ్బాయికి భలే ‘సెగ’తగిలిందని, ఇక దిగి వస్తాడని అందరూ అనుకుంటున్నారు.

లైను చెబితే పిచ్చోడు!
స్క్రిప్టుమీద ఆరునెలలు కూర్చున్నాం, పది నెలలు పడుకున్నాం అని తరచు పరిశ్రమలో స్టేట్‌మెంట్లు విన్పిస్తుంటాయి. ఇవి దర్శకులో, నిర్మాతలో చెప్పే మాటలు. ఇవన్నీ స్టార్స్‌తో ‘లైను’ ఓకే చేయించుకున్నాక చేసే పనులు. ముందు లైను, తర్వాత కథమీద యోగాసనాలు వేసే పద్ధతి చాలా కాలంగా అమల్లో వుంది. ఇంతలో కొందరు స్టార్స్‌కి ఏమైందో ఏమోగానీ-లైను కాదు, పూర్తి స్క్రిప్టుతో రావాలని ఫర్మానా జారీ చేస్తున్నారు. జూనియర్ ఎన్‌టిఆర్‌తో, రవితేజతో ఈ అనుభవాలే ఎదురయ్యాక కొందరు టాప్ డైరెక్టర్లు కంగుతిని వెనక్కిపోయారు. లైను చెప్పేసి స్టార్ డేట్లు ఈజీగా సంపాదించే సరదా ఆటకి బ్రేకుపడి, ముందే స్క్రిప్టుమీద కూర్చుని, పడుకుని, తిప్పలుపడి ఆ కష్ట ఫలితంతో స్టార్ సుముఖానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చి పడింది. పవన్‌కళ్యాణ్‌తో కూడా ఈ ముందస్తు కాయకష్టం తప్పడంలేదని వినికిడి. ఈ స్టార్లు ఏడాదికో సినిమా పద్ధతికి పాల్పడుతున్నప్పుడు ‘లైను’మీద లైనుకి రావడం కుదిరింది గానీ, ఇప్పుడు ఏడాదికి మూడు సినిమాల స్క్రీముకి తెరతీస్తున్నందున, వెంట వెంటనే ఫుల్‌స్క్రిప్టులవసరం. అప్పుడే ఫుల్ భోజనం దర్శకులకి. లేకపోతే ఆకలి దప్పులతో ఫిలింనగర్ వీధుల్లో ‘‘ఆకలై లైను చెబితే పిచ్చోడన్నారు స్టార్లు’’ అని పాడుకోవడమే!

టాలీఫుడ్డేమిటి?
ఈ ప్రశ్న అమాయకులు వేస్తారు. టాలీవుడ్‌లో ఏం ఫుడ్ తింటారంటే, అనేక మంది ధవళకాంతులీనే హోమియోపతీలాంటి చిన్న చిన్న పాలిథిన్ పొట్లాల్లో లభించే కొకైన్ తింటారని గత సంవత్సరకాలంగా మీడియా కోడై కూస్తోంది. ఒక గ్రాము మూడు వేల రూపాయలు. తాజాగా నల్ల జాతీయుల నుంచి ఈ తెల్ల పదార్థం తను శాయశక్తులా ముట్టుకోలేదని యువస్టార్ ‘వరుణ సందేశ’ మిచ్చాడు. కావాలంటే రక్తదానానికి-సారీ రక్త పరీక్షకి రెడీ అంటున్నాడు. తను బాక్సాఫీస్ పరీక్షకి సరిగ్గా ఎదురొడ్డి నిలబడి వుంటే ఈ రక్త పరీక్ష విషమ పరిస్థితి వచ్చేదికాదు. తొమ్మిదిలో ఆరు సినిమాలు ఫ్లాపయి మార్కెట్ పోగొట్టుకున్నది చాలక, డ్రగ్ కేసులో ఇరుక్కుంటే హ్యాపీడేస్, కొత్తబంగారులోకం వేలం వెర్రి అభిమాన ప్రేక్షకులకి ఏం సందేశమిస్తున్నట్టు. ‘కుర్రాడు’లో భూస్థాపితమైన మోటార్ సైకిల్ కోసం పోరాటం చేసినట్టు, ఇప్పుడు ఎనె్నన్ని సాక్ష్యాల్ని భూస్థాపితం చేయాలి...హీరోయిజం వికటిస్తే రేపు పోలీసుల పాలీగ్రాఫ్ యంత్రాన్ని కూడా అపహరించుకుపోవాల్సి రావచ్చు. తను రక్తపరీక్ష అంటుంటే, పోలీసులు పాలీగ్రాఫ్ పరీక్ష కోసం కోర్టుకెళ్లారు. అలాగే దానికి తగిన భద్రత కోసం కూడా అర్జీపెట్టుకుంటే మంచిదేమో! *

Friday, July 29, 2011

అజయ్‌కి ఛాలెంజ్!

బాలీవుడ్‌లో ఇప్పుడు అబ్బాయిలే వున్నారనీ, మగాళ్లు లేరనీ యాక్షన్ హీరో అజయ్‌దేవగన్ చేసిన కామెంట్‌ని మన యువ హీరో తనీష్ ఛాలెంజి చేస్తున్నాడా? అజయ్ దేవగన్ చెప్పిన మగాడుగా తనొకడు టాలీవుడ్‌లో ఉన్నట్టు తన బాడీని పెంచి పోషిస్తున్నాడా? ‘కోడిపుంజు’లో అమాంతం తెగ లావెక్కిపోయిన తనీష్‌ని చూస్తే ఇది నిజమేనన్పిస్తుంది. బాలీవుడ్‌లో అబ్బాయిల సినిమాలు కేవలం మల్టీప్లెక్స్‌ల్లోనే ఆడతాయని, అలా కాక తనలాంటి, సల్మాన్ ఖాన్‌లాంటి సీనియర్ల సినిమాలు అన్ని సెంటర్లలో ఆడతాయనీ సెలవిచ్చాడు అజయ్‌దేవగన్. ఒక కమర్షియల్ ఎస్సై పాత్రనో, మాఫియా పాత్రనో పోషించాలంటే కనీసం ఇరవై ఏళ్ల సీనియారిటీ ఉండాలని, అబ్బాయిలు ఇక్కడే ఫెయిలవుతారనీ అజయ్ ఎనాలసిస్. నిన్న మొన్నటివరకు టీనేజ్ శరీరంతో ప్రేమ సినిమాలు చేసుకుంటున్న తనీష్‌కి ఒక్కసారిగా మగాడుగా ఎదిగిపోయి మాస్ సినిమాలు చేయాలని బుద్ధిపుట్టిన మాట అతనే ఒప్పుకున్నాడు. దీని రిజల్టు-టీనేజీ ఫేసుతో వస్తాదుబాడీ! ‘కోడిపుంజు’లో ఒంటి చేత్తో రౌడీల బాడీలు హూనం! స్థూలకాయంతో పడలేక జూనియర్ ఎన్టీఆర్, విష్ణు లాంటి యంగ్‌స్టార్సే సన్నబడుతుంటే, తనీష్ లాంటి లేత కుర్రాడు ఇలా పూరీలా విపరీతంగా ఉబ్బిపోవడం బాగా ఎబ్బెట్టుగానే ఉంది సినిమాలో!

రెండో ఆటకి రెడీ!
టాలీవుడ్‌లో కొత్త సీజన్ వచ్చి చేరింది. ఆనవాయితీగా ఉండే సంక్రాంతి, సమ్మర్ సెలవుల సీజన్‌లతోపాటు, గత సంవత్సరంనుంచీ దసరా సీజన్ కూడా ప్రారంభించారు. దసరాకి ‘ఖలేజా’తో మహేష్‌బాబు, ‘పులి’తో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ ‘బృందావనం’ విడుదల చేసి బాక్సాఫీస్‌ని టెస్ట్ చేశారు. మొదటిరెండూ టెస్టులో వూస్టయిపోగా, చివరిది ఓ మాదిరిగా తేలి బ్యాడ్ టేస్టుని మిగిల్చాయి. అయినా మళ్లీ దసరాకి రెండో ఆటకి రెడీ అవుతున్నారు. మహేష్‌బాబు ‘దూకుడు’, పవన్ కల్యాణ్ ‘కాళి’, ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి‘ మాత్రమే కాక, కాస్త డెలివరీ పెంచుదామని బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’, నాగార్జున ‘రాజన్న’, వెంకటేష్ ‘బాడీగార్డ్’లని కూడా బరిలోకి దింపుతున్నారు. బరిలో రంగహరీ... అంటూ దసరా సంబరాలకి వచ్చేస్తున్న ఈ ఆరు సినిమాల పెట్టుబడిని (దాదాపు 200 కోట్లు) మేమెక్కడనుంచి తెచ్చి సర్దాలని అప్పుడే ప్రేక్షకులు బెంబేలెత్తిపోవచ్చు. మా డబ్బుతో మమ్మల్ని పండగ కూడా చేసుకోనివ్వరా అని శోకాలు పెట్టవచ్చు. అదేం కుదర్దు. టాలీవుడ్ ప్రేక్షకులేం కోరుకుంటున్నారో అదివ్వదు. అదేం ఇవ్వాలనుకుంటోందో అదే ఇస్తుంది. దసరాకి ఆరు సినిమాల్ని హిట్ చేయకపోతే మళ్లీ దసరాకి 12 సినిమాలతో అంతు చూస్తుంది జాగ్రత్త!

అప్పుల్లో ఫ్లాపులు!
ఒక విషయంలో పూరీ జగన్నాధ్‌ని ఒప్పుకోవాలి. తను అప్పుల పాలు కావడంవల్లే హిట్లు ఇవ్వలేకపోయానని ఆయన నిజాయితీగా ప్రకటించాడు. పూరీ కంటే ముందు అప్పులపాలైన తేజ ఇలా ఒప్పుకోలేదు. పైగా ‘నిజం’ దగ్గర్నుంచీ ‘కేక’ వరకు చతికిలబడి, తిరిగి కొత్త సినిమాతో అలాగే కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు ఆర్థిక బాధలు తీరాయో లేదో గానీ, తిరిగి మొదటికొచ్చి కొత్తవారితో యూత్ సినిమాకి తన క్రియేటివ్ పవర్స్‌ని ప్రదర్శించాలనుకుంటున్నాడు. మరోవైపు ‘దేశముదురు’ అనే హిట్ తర్వాత నిన్నటి ‘నేనూ నా రాక్షసి’ వరకు ఆరేడు సినిమాలు రాక్షసంగా ఫ్లాపయ్యాక, ‘బుడ్డా హోగా తేరే బాప్’ తో ముఖంలో ఆనందరేఖలు విలసిల్లి ఇప్పుడు ఆర్థిక బాధలు లేవుకాబట్టి ‘బిజినెస్ మాన్’ని బిగ్ హిట్ చేస్తానంటున్నాడు పూరీ. దర్శకులు సినిమా బిజినెస్ కూడా చేస్తే ఏమవుతుందో వీళ్లద్దరే ఉదాహరణ. క్రియేటివ్ పవర్స్ అన్నీ అవకతవక బిజినెస్ కష్టాల్లోంచి బయటపడేందుకే ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. జేబు ఖాళీ అయిందని బుర్ర ఇలా ఖాళీ చేసుకుంటే దర్శకత్వానికేం మిగులుతుంది? అంత దూరం వెళ్లనవసరం లేదు. సకాలంలో స్క్రిప్టు వర్క్ పూర్తి చేసుకోలేక, ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించుకుని బుర్రంతా వాటిమీదపెట్టుకునే దర్శకుల పనీ ఇంతే అవుతోంది. ఇది చూస్తూ నిర్మాతలు నట్టేట మునిగి ‘బచావ్ బచావ్’ అని కేకలేస్తున్నారు!

పందెం నెగ్గని పుంజు!

md abdul

* కోడిపుంజు (బాగోలేదు)
తారాగణం:
తనీష్, శోభన
రోజా, శివకృష్ణ
శ్రీధర్, ఎమ్మెస్ నారాయణ
రాజ్యలక్ష్మి, సత్యప్రకాష్
రాళ్లపల్లి తదితరులు.
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: శివకుమార్
నిర్మాణం:
శ్రీ శైలేంద్ర సినిమాస్
నిర్మాత: ఎస్.ఎస్.బుజ్జిబాబు
దర్శకత్వం: బి.వి.వి.చౌదరి

ఓ నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించే తీరిక నేటి తరానికి లేదు. నచ్చింది చేసేస్తారు. కొన్ని సార్లు పంతాలకు పోయి ఇబ్బందుల్లో పడతారు. కానీ అన్నిసార్లు చేతులు కట్టుకుని కూర్చోవడం కుదరదు. ఆవేశంతో అడుగేస్తేనే లక్ష్యాలు నెరవేరతాయి. అనుకున్న లక్ష్యం కోసం పందెం ‘కోడిపుంజు’లా తెగువ చూపిన కుర్రాడి కథే ఈ చిత్రం. తెలుగు సినిమాని గత ఏడాది కాలంగా పరిశీలిస్తే విడుదలవుతున్న సినిమాలు ఏ మేరకు సొమ్ములు తీసుకొస్తున్నాయి అని ప్రశ్నించుకుంటే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎక్కువ శాతం పరాజయానే్న చవిచూస్తున్నాయి. లాజిక్కులేని కథలు, మూస ధోరణిలో సన్నివేశాలు, నవ్వించని కామెడీ ట్రాకులు, కొత్తదనం పేరుతో విపరీత ధోరణులు...ఇవి ప్రేక్షకుల పాలిట శాపంగా మారుతున్నాయన్నది చిత్రసీమ మీద ఒట్టేసి చెప్పే నిజం. తెలుగు సినిమాలో కథ అనేది బ్రహ్మపదార్థం. అది వుంటే వుంది అనుకోవాలి. లేదు అంటే లేదు అనుకోవాలి. సరిగ్గా ఇదే జరిగింది ఈ ‘కోడిపుంజు’ విషయంలో.
కథలోకి వెళితే...తండ్రికి తగ్గ తనయుడు అనే మాట విన్నాం. కానీ తల్లికి తగ్గ తనయుడనేది మనం చాలా తక్కువ విన్నాం. ఈ కోవకి చెందిన యువకుడే అభిమన్యు (తనీష్). తల్లి దగ్గుబాటి సీతారత్నం (రోజా)గారి అబ్బాయి అంటే చాలు. తల్లి చూసి రమ్మంటే పీకి వచ్చే రకం. తల్లి నుంచి వారసత్వంగా ఆస్తితో పాటు కావలసినంత పొగరు వచ్చింది. కొడుకుతో తొడగొట్టించి మరీ కయ్యానికి పంపే ఘటికురాలు సీతారత్నం. పెద్ద కత్తి సంచిలో పెట్టుకుని మోపెడ్ మీద తిరుగుతుంటుంది. తేడా వస్తే కత్తితో తిరగబడుతుంది. సీతారత్నం భర్త వ్యవసాయంలో నష్టమొచ్చి ఆత్మహత్య చేసుకుంటే, తనే వ్యవసాయధారిణిగా మారి రెండు ఎకరాలని ఇరవై ఎకరాలు చేసింది. కొడుకుని మంచి చదువులు చదివించి మంచి ప్రయోజకుడిని చేసింది. ఇలా వుంటే తూర్పుగోదావరి జిల్లాలో ‘రామరాజు లంక’ అనే గ్రామం. ఆ గ్రామ ప్రెసిడెంట్ రామచంద్రరావు (శివకృష్ణ) దాన ధర్మాలలో అందె వేసిన చేయి. ఆ విషయంలో ఎంతో పేరు సంపాదిస్తాడు. తన ఐదు వందల ఎకరాలని యాభై ఎకరాలు చేశాడు. పెద్ద కూతురు పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైతే, చిన్న అమ్మాయి నందిని (శోభన) ఇక్కడే చదువుకుంటోంది. అదే గ్రామంలో రామచంద్రరావు కుర్చీ మీద కనే్నసి వున్నాడు అల్లూరి బాపీనీడు (సత్యప్రకాష్). ఇతని తమ్ముడు నాగినీడు రామచంద్రరావు కూతురి మీద కనే్నశాడు. ఒకానొక సమయంలో నందినీని టీజ్ చేసిన నాగినీడుని వీరబాదుడు బాదుతాడు అభిమన్యు. ఆ సమయంలో అతడి కండ బలం చూసిన నందిని అతడి ప్రేమలో పడుతుంది. ఈ విషయంలో నాగినీడుతో చాలా సమస్యలు వస్తాయి. అతను దగ్గరవ్వడం, అతన్ని క్షమించి అభిమన్యు తన గ్రూపులో చేర్చుకోవడం ఆమెకి నచ్చదు. అయితే అభిమన్యు-నందినీల ప్రేమ ఇటు సీతారత్నంకి, అటు నందిని తల్లి (రాజ్యలక్ష్మి)కి తెలిసిపోతుంది. పిల్లల ప్రేమను కాదనలేక ఎంతో సంతోషంతో ఇద్దరూ అంగీకారం తెలుపుతారు. ఓ రోజు శ్రీరామనవమి సందర్భంగా నందినితో అభిమన్యు పందెం కాసి, ఆ దరిమిలా ఆమె తండ్రి కంటపడిపోతాడు. తన కూతురితో అతడి ప్రవర్తనకి మండిపడి అభిమన్యు తల్లి సీతారత్నం క్యారెక్టర్‌పై కూడా నిందారోపణలు చేస్తాడు. ఈ ఆరోపణలకు ఆవేశం ఆపుకోలేని అభిమన్యు ఆత్మాభిమానం దెబ్బతిని ‘మీ కూతుర్ని తన వశం చేసుకుంటా. ఎన్నికలలో నవ్వు పరాజయం పొందేలా చూసి నీ పరువుతీస్తా’ అని సవాల్ విసురుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే అసలు సిసలైన ‘కోడిపుంజు’ క్లైమాక్స్.
ఈ సినిమాని పూర్తి మాస్ అనుకుని చూస్తే సగం వరకే అలాంటి అనుభూతి కలుగుతుంది. దర్శకుడు బి.వి.వి చౌదరి ఎంచుకున్న కథలో కొత్తదనం ఏమీ లేకపోగా, చూసే ప్రేక్షకులకు విసుగుపుట్టించింది. సినిమాల్లో ఓ సూత్రం వుంది. కొత్త కథను అర్థమయ్యేలా చెప్పాలి. పాత కథను కొత్తగా చెప్పాలి. ఇది చాలా వరకు ఫలితాన్నిచ్చే సూత్రమే. ఎందుకంటే మన దర్శకులు చాలా వరకూ పాత కథల్నే వండిస్తూ తాళింపు, మసాలాల్లో చూపే తేడా వల్లే ప్రేక్షకులు కూసింత కొత్త దనాన్ని ఫీలవుతుంటారు. కానీ ఈ ‘కోడిపుంజు’లో ఆ కొత్తదనం మచ్చుకైనా కనిపించదు. ‘దమ్మున్నోడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన చౌదరి ఈ ‘కోడిపుంజు’ని పందెం నెగ్గేలా తీర్చిదిద్దలేకపోయాడు. రొటీన్ కథనే తీసుకున్నా, అందులో అతడి ప్రతిభని ఏ మాత్రం చూపించలేకపోయాడు. కాలం చెల్లిన కథే అయినా దాన్ని తీర్చిదిద్దడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. చిత్ర ప్రథమార్థంలోతెచ్చిన టెంపోని దర్శకుడి ద్వితీయార్థంలో చూపించలేక చతికిల పడ్డాడు. విశ్రాంతిలో హీరో చేసిన ఛాలెంజ్‌లు ద్వితీయార్థంలో పూర్తిగా మరచిపోయారు. దీంతో కథంతా గజిబిజిగా సాగి ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించింది.
ఇక నటీనటుల విషయానికొస్తే...లవర్‌బాయ్ ఇమేజ్‌ను వదిలి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలన్న తపనతో బాడీని విపరీతంగా పెంచేసుకుని స్థూలకాయుడిలా మారిపోయిన తనీష్ తన పాత్రకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఎమోషనల్‌గా వుంటూనే సీతారత్నంలా రోజా అభినయం మెచ్చుకోతగ్గది. ఇలాంటి పాత్రలు ఆమెకు అతి సులువైనవే. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. కొత్తనటి శోభన సోసోగానే చేసింది. ఎక్స్‌ప్రెషన్స్ ఇంకా బాగా పండించాల్సింది. మిగతా నటీనటుల సంగతి సరేసరి. సంగీతం విషయానికొస్తే అనూప్ రూబెన్స్ బాణీలు అంతగా ఆకట్టుకోలేదు. భాస్కరభట్ల రవికుమార్ రాసిన ‘వాలే వాలే..వయసే వాలే..’ తనీష్, మధుశర్మలపై ఒకే ఒక్క పాట మాస్‌ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకు కెమెరా వర్క్‌ని అందించిన బి.శివకుమార్‌ని మెచ్చుకోకుండా వుండలేం. తన వంతు పాత్రని సమర్థవంతంగా నిర్వహించారు. మాటల విషయానికొస్తే...రోజా కొడుకుతో ‘కమ్మెయ్, చంపేయ్, నరికేయ్ అని నిన్ను కోడిపుంజులా పెంచానని చెప్పడం, కోపంగా వున్న ప్రతీసారి హీరో ‘నా పేరు అభిమన్యు..సన్నాఫ్ దగ్గుబాటి సీతారత్నం’ అని చెప్పడం ఎబ్బెట్టుగా అనిపించింది. ఎడిటింగ్ సోసోనే. మొత్తం మీద ఓ నాసిరకమైన కథను ఎంచుకోవడమేగాక, పసలేని స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల మీదికి వదిలిన ఈ ‘కోడిపుంజు’ పందెంలో ఏ మాత్రం నెగ్గలేకపోయింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తనీష్ కథల విషయంలో ఇకనైనా జాగ్రత్త వహిస్తే బావుంటుంది.

Friday, July 22, 2011

నటన తార?

తమాషా కార్నర్

సినిమాల్లో నటన విరమించుకుంటున్నానని చెప్పి అద్భుతమైన వీడ్కోలు దృశ్యం సృష్టించి తీరా జీవితంలో నటించడం మొదలుపెడితే ఆ నటీమణికి ‘నటనతార’ బిరుదు ఇవ్వాల్సిందే. మనం చెప్పుకుంటున్నది నయనతార గురించి. ‘శ్రీరామరాజ్యం’ షూటింగ్ పూర్తయిన సందర్భంగా కన్నీళ్లు పెట్టుకుని, యూనిట్ సభ్యులకి వాచీలు పంచిచ్చి అందరి హృదయాలూ బరువెక్కించి నిష్క్రమించింది. దీనర్ధం ఆమె ప్రభుదేవాని వివాహం చే సుకుని సినిమాలకి స్వస్తి చెబుతున్నట్టు అని సహజంగానే మీడియాలో ప్రచారమైంది. అది వివాహానికి ప్రభుదేవా పెట్టిన షరతు అన్నారు. సన్నివేశం, దానికి తగ్గ వ్యాఖ్యానంగానే ఈ మొత్తం వ్యవహారం కనిపించింది. తీరా ఈ మంగళవారం నయనతార దీన్ని ఖండించింది. తనకి సినిమాలకు గుడ్‌బై చెప్పే ఆలోచనే లేదని, ఈ వార్తలెలా ప్రచారంలోకి వచ్చాయో తెలియడంలేదని వాపోయింది. ఇప్పుడు ఎవరు తెల్లబోవాలి-మీడియానా? అసలు నయనతార సెట్లో అలాంటి టచింగ్ సీన్ ఎందుకు క్రియేట్ చేసింది? ఏ సినిమా ముగింపు సందర్భంగానూ అలాచేయలేదే? ఇంతకీ ఆమె నయనతారా? లేక నటనతారా? అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. కాస్సేపు జుట్టు పీక్కుందాం!

స్టార్లు కావలెను!

చిన్న కథలు రాసుకుని చిన్న నిర్మాతల్ని సంప్రదిస్తున్న దర్శకులకి వింత అనుభవం ఎదురవుతోంది. చిన్న నిర్మాత కూడా పెద్ద స్టార్‌ని అడుగుతున్నాడు. చిన్న హీరోలతో, కొత్తవాళ్లతో తీస్తే 30 శాతం ఓపెనింగ్స్ కూడా రావడంలేదు. తీసి ఏం లాభమని పెదవి (ప్రపోజల్స్) విరుస్తున్నారు. ఛిద్రమైన ప్రపోజల్స్‌తో దర్శకులు తిరిగి వస్తున్నారు. పోనీ పబ్లిసిటీ, పంపిణీ నెట్‌వర్క్స్ బాగా ఉన్న అగ్రనిర్మాతల దగ్గరికి పోదామంటే ఆ చిన్న సినిమాతో వాళ్లకే పేరొస్తుంది తప్ప దర్శకుడికి మళ్లీ సినిమా రాదు. ఇక కొత్తగా వచ్చే నిర్మాతలే బెటర్ అనుకుంటే అలా వస్తున్న వాళ్లు అతి తక్కువమంది, దర్శకులు ఎక్కువమంది. డిమాండ్-సప్లై పరిస్థితి ఈ తీరున ఉంటే ఇంకా ఎటువైపు చూడాలి? ఎంతకాలం ఎదురు చూడాలి? చిన్న నిర్మాతలు కూడా స్టార్స్ కావాలంటుంటే చిన్న చిన్న హీరోలు ఏమైపోవాలి? నాని లాంటి చిన్న హీరోలని కూడా రాజవౌళిలాంటి టాప్ దర్శకులు లాగేస్తుంటే, వాళ్లు అందకుండా అమాంతం స్టార్లు అయిపోతున్నారు. ఇంకేం చెయ్యాలి? ఇంకేం చేయనక్కర్లేదు, చిన్న సినిమాల్ని చిన్న నిర్మాతలే బతకనిచ్చే రోజుల్లేవని, వాళ్లు స్టార్ సినిమాలు చూస్తూ కాలక్షేపం చేయాల్సిందేనని ఓ దర్శకుడి విసురు!

మల్టీషాక్?

సింగిల్‌స్టార్ సినిమాలు సింగిల్‌స్టార్ రివ్యూలకి నోచుకుంటున్న గడ్డు పరిస్థితుల్లో మల్టీ స్టారర్ సినిమాలైనా రావాలని-అలా బాలీవుడ్‌కి దగ్గరగా చేరి జాతి జీవన స్రవంతిలో కలవాలనీ బయ్యర్ల దగ్గరనుంచి ప్రేక్షకుల వరకు ఆశించడంలో తప్పులేదు. అదిగో అందుకే స్టార్ నిర్మాత దిల్‌రాజు అలాంటి మల్టీస్టార్ కల సాకారమయ్యేందుకు విక్టరీ వెంకటేష్‌నీ-పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌నీ ఒక దగ్గర చేర్చి హమ్మయ్య అనుకున్నాడు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా హమ్మయ్యా అనుకునేంతలో సమ్-అయ్య మిస్సయ్యాడు! ఎవరా అని చూస్తే పవన్‌కల్యాణ్! తను టాటా చెప్పేసి తన పవర్ వేరే సినిమాకి చూపిస్తుంటే షాకైన నిర్మాతకి దర్శకుడికి మళ్లీ మొదటకొచ్చింది. ఈసారి ప్రిన్స్ మహేష్‌బాబుని మిస్సింగ్ ప్లేసులోకి తెచ్చుకున్నారు. ఇది కూడా మిస్సింగ్ కేసు కాకూడదని ప్రార్ధిస్తున్నారు. కానీ ముందుంది ‘దూకుడు’. మహేష్‌బాబు ‘దూకుడు’ విడుదలయ్యాక దాని ఫలితాలెలా ఉంటాయో, బాబు మైండ్ సెట్ ఎలా మారి ఎలా మరో మల్టీషాకు తగులు తుందోనన్న ఆందోళనతో ఫిలింనగర్ పరిసరాల్లో పనీపాటా లేని వర్గాలు తిండి తిప్పలు మానేసి గడుపుతున్నాయి. ఫ్యాన్స్‌కి లేని దురద వీళ్లకెందుకంటారా-కొందరింతే! *

Friday, July 15, 2011

మెగాలీల!

తమాషా కార్నర్

అదృష్టం ఎప్పుడెవరికెలా వరిస్తుందో తెలీదు. సినిమా ఫీల్డులో స్ట్రగుల్ చేస్తున్న సాధారణ జీవులే కాదు, అగ్రస్థానాలకి చేరుకున్న ప్రముఖులూ ఇంకా అదృష్టం కోసం పరితపిస్తూంటారు. అది వరించకపోతే అంతటాప్ పొజిషన్‌లో కూడా విచారపడతారు. మెగాస్టార్ చిరంజీవి పరంగా అదృష్టం కోసం ఎదురుచూస్తున్న టాప్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌కి ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. అసలు చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు, అసలుంటుందా లేదా అన్న సస్పెన్సులో కూడా వినాయక్ ఆ అదృష్టం తనకే వరిస్తుందని నమ్మడం, పరుచూరి బ్రదర్స్ కూడా స్క్రిప్టు సిద్ధం చేసి పెట్టుకోవడం జరిగిపోయాయ. ఇంతలో ఉరుములేని పిడుగులా వార్త వచ్చి నెత్తిన పడింది. చిరంజీవి 150వ సినిమా పూరీ జగన్నాథ్ ఖాతాలో కెళ్లిపోయింది. అంతేకాదు, 151వ సినిమాకి రామ్‌గోపాల్‌వర్మ అప్పుడే కర్చ్ఫీ వేసేసినట్టుకూడా గుప్పుమంది! మ్యూజికల్ ఛైర్స్ ఆటలో తానొక్కడే వున్నానని నమ్మిన వినాయక్ చూస్తుండగానే, పూరీ దర్జాగా వచ్చి తిష్టవేయడం కంగు తినిపించింది. ఇదంతా మెగాలీల! తలవంచక తప్పదు మరి!!

అడ్వాన్స్ లుక్!
అసలే పైరసీతో సినిమాలు గజగజ వణికిపోతున్నాయి. దీనికి నకిలీ స్టిల్స్ కూడా తోడుగా తయారవుతున్నాయి. నిర్మాతలు సినిమా పూర్తయ్యాక విడుదల చేసే ఫస్ట్‌లుక్ ఫోటోల వరకూ ఇక ఆగనవసరంలేదనీ, సినిమా ప్రారంభించడానికి ముందే అడ్వాన్స్ లుక్ చూపించేస్తామనీ కొందరు ఔత్సాహికులు ఇంటర్నెట్‌లో హడావిడి చేస్తున్నారు. ఫోటోషాప్‌తో షాపింగ్ చూపించేస్తున్నారు. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇంకా నటించనున్న ‘గబ్బర్‌సింగ్’ స్టిల్స్ సృష్టించి అభిమానులకి అమితానందం కలిగిస్తున్నారు. దీనిపై నిర్మాత గణేష్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇకనైనా అడ్వాన్స్ లుక్ ఔత్సాహికులు తమ ప్రయత్నాలు మానుకుంటారో లేదో తెలీదుగానీ, వాళ్లని అదుపులో పెట్టడానికి పవన్‌కళ్యాణ్ కూడా సరిపోడనిపిస్తోంది. రియల్ గబ్బర్‌సింగ్ గగనతలం నుంచి పాన్ మసాలా తిని వూసి ‘కిత్నే ఆద్మీ థే రేవో?’అని గర్జిస్తే తప్ప, నెట్‌మాటున వెటకారాలు చేస్తున్న ఆద్మీలు పుంజాలు తెంపుకుని పారిపోయేలా లేరు. అప్పుడు వాళ్లకి ఆద్మీలుక్స్ కూడా వుండకపోవచ్చు!

ఫ్రెష్ టైటిల్స్!
ఇక తెలుగు సినిమాల్ని క్రిమికీటకాలు ఏలుకుంటాయ! రకరకాల సింహాలుగా, పులులుగా, నాగులుగా జంతు జలాన్ని కవర్ చేసిన మన స్టార్లు ఈ చరాచర సృష్టిలో క్రిమికీటకాదులపై ఇంట్రస్టు చూపుతున్నారు. దీంతో వారికి ఊసరవెల్లి, ఈగ, కందిరీగ లాంటి జీవులు ప్రాణ ప్రదమవుతున్నాయి. ఇవి గనుక ఫర్వాలేదన్పించే తీరులో పరువు నిలబెడితే మిడుత, జోరీగ, మిణుగురు పురుగు, దోమ, గండుచీమలాంటి టైటిల్స్‌తో ఫారాలు పట్టుకుని పోటాపోటీగా రిజిస్ట్రేషన్లకి పరుగులు తీయవచ్చు. ఇవి కూడా ఐపోతే ఎలా అన్న చింత అక్కర్లేదు. సూక్ష్మజీవులున్నాయి. వైరస్, బాక్టీరియా, అమిబా, హైడ్రా, ఈ-కోలీ లాంటివి మరింత క్రేజ్ సృష్టిస్తాయి. మోడరన్‌గా కూడా వుంటాయి. ఇంకా నేచర్‌ని కొల్లగొట్టడానికి సముద్ర సంపద కూడా వుంది. ఎలాగూ అనె్నం పునె్నం తెలీని చేపలకి, తిమింగలాలకి అవినీతి చేప, అవినీతి తిమింగలం అంటూ పత్రికల్లో రాసేస్తున్నారు కాబట్టి, కేడీ చేప, రౌడీ తిమింగలం, కంత్రీ రొయ్య అనే టైటిల్స్‌ని విప్లవాత్మకంగా సృష్టించుకుని పెట్టుకోవచ్చు. ఇది ఏ జీవహింస చట్టాల కిందికీ రాదు గాక రాదు! *