Sunday, March 27, 2011

జై భోలో తెలంగాణా

తెలంగాణ బతుకుచిత్రం!
February 10th, 2011
*** జై బోలో తెలంగాణ (బాగుంది)
తారాగణం: జగపతిబాబు, స్మృతీఇరానీ సందీప్,
మీరానందన్, గౌరీశంకర్, వేదకుమార్, శివారెడ్డి
దేశపతి శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మయ్య , డా.శ్రవణ్ తదితరులు.
కెమెరా: టి.సురేందర్‌రెడ్డి
సంగీతం: చక్రి
నిర్మాణం: మహాలక్ష్మి ఆర్ట్స్
కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: ఎన్.శంకర్
ఉద్యమాల పురిటిగడ్డలో ఉరకలెత్తే ఉత్సాహంతో సరికొత్తగా వచ్చిన ప్రజా ఉప్పెన ప్రత్యేక తెలంగాణ పోరాటం. గత దశాబ్దంగా ప్రజావాణితో బాటు, రాజకీయ సంక్షోభాలకు కారణమైన ఉద్యమ తీవ్రత గూర్చి వివరిస్తూ, తెలంగాణా కళాకారుల మమేకంతో జన ప్రవాహంలా సాగిన జనజీవిత వ్యవస్థను అద్దంలో చూపే ప్రయత్నం ఎన్నదగినదే. అయితే ప్రజా నాయకులు రాజకీయ యవనికపై ఈ ఉద్దృత పోరాటానికి ఎంతమంది బావుటాలెత్తారు? వారి ఉద్యమ ప్రస్థానం ఎలా సాగిందీ? అందులో కష్టనష్టాలు, ఒడిదుడుకులు, ఒక ప్రాంతం విడిపోతే ఎవరికి ఖేదం? మరెవరికి మోదం అన్న ప్రశ్నలు వేస్తూ, వాటికి జవాబులు కూడా ఎవరికి వారు చెప్పుకునే స్క్రీన్‌ప్లేతో ‘జై బోలో తెలంగాణ’ చిత్రం ఆసాంతం సాగుతుంది.
‘‘తెలంగాణాలో పుట్టిన ఓ బిడ్డగా నా బాధ్యతగా భావించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. చరిత్రలో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఉత్తేజం, ఉద్వేగం నాలో కలుగుతోంది’’ అని దర్శకుడు ఎన్.శంకర్ తను రూపొందించిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రం గురించి ఇన్నాళ్లుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆ మాటల్లో ఉన్న ఉద్వేగం, బాధ్యత చిత్రంలో ఎంతవరకు ప్రతిబింబించింది. ఎంతవరకూ ప్రతి ఫలించిందీ అంటే థియేటర్లలో డైలాగులకు, పాటలకు వస్తున్న స్పందనంత.
కథలోకెళితే...బందగీ గోపన్న (జగపతిబాబు) కుటుంబం అనేక తరాలుగా తెలంగాణ ఔన్నత్యాన్ని చాటుతూ, నిజాం దొరల ఏలుబడిలో జరిగిన మానవ వనరుల దోపిడీని ప్రశ్నిస్తూ, సంఘానికి బాట చూపేవారు. ఆ క్రమంలో గోపన్న ప్రత్యేక తెలంగాణ అంశంపై ప్రజా ఉద్యమాలు లేవదీసి పోరాడి పోలీసు కాల్పుల్లో అమరుడవుతాడు. అతని భార్య జయమ్మ (స్మృతిఇరానీ) ‘అమ్మఒడి’ అనే ఆశ్రమం స్థాపించి అన్నార్తులకు, అభాగ్యులకు ఆసరాగా ఉంటుంది. జయమ్మ కొడుకు వర్షిత్ (సందీప్)కు తండ్రి, తాతల్లాగే ఆశయం కోసం మరణించడం ఇష్టముండదు. మంచి చదువులు చదువుకొని జీవితంలో స్థిరపడిపోవాలనుకుంటాడు. ఆ క్రమంలో అతడికి విజయవాడ నుంచి ఉద్యోగం నిమిత్తం వచ్చిన సహజ (మీరానందన్) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీస్తుంది. తెలంగాణ అబ్బాయి, సీమాంధ్ర అమ్మాయి మధ్య ప్రేమ అంకురించడం వల్ల వర్షిత్ తన ప్రేమకే ఎక్కువ విలువ ఇస్తాడు. అప్పటికే వర్తమాన తెలంగాణ పోరాట చిత్రం దేశ పటంపై సాగుతుంటుంది. ఈ నేపథ్యంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లిన వర్షిత్‌కు తెలంగాణ పల్లె జనం పడుతున్న కష్టాలు, కన్నీళ్లు తెలిసి వస్తాయి. దాంతో తన ప్రేమను పణంగా పెట్టి ఉద్యమంలోకి దూకుతాడు. ఇలా వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆ జంట ఒకటయ్యారా...ఉద్యమం వారికి ఏమి మిగిల్చింది అనేదే అసలైన క్లైమాక్స్.
సినిమా అంటేనే కొంత కల్పన ఉండాలి. ఉన్నదున్నట్లు చెబితే అది సినిమాటిక్‌గా ఉండదనుకున్నారో ఏమో, ఉద్యమ కథకు ప్రేమకథను ముడిపెట్టారు. కథగా చూస్తే ఇది రొటీన్ ప్రేమకథే. అయితే దర్శకుడు శంకర్ ప్రతిభ అంతా ప్రేమకథని ఉద్యమానికి ముడివెయ్యటంలోనే చూపెట్టాడు. ఉస్మానియా యూనివర్శిటీ కాల్పుల ఘటన, తెలంగాణ కోసం తొలిసారి అమరుడైన శ్రీకాంత్‌చారి మరణం, కెసీఆర్ నిరాహారదీక్ష, తర్వాతి పరిణామాలు, ముఖ్యంగా డిసెంబర్ 9న కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన, తెలంగాణా నేతల పాత్రలు కూడా కథలో మిళితమవడంతో చిత్రం క్లారిటీగా వచ్చింది. నెగెటివ్‌గా చూపెట్టిన తెలంగాణేతర ప్రాంత పాత్రలు కూడా కథలో మిళితమై కథకు నిండుతనం తెచ్చిపెట్టాయి. జానపదబాణీతో గద్దర్ పాట చిత్రానికి ఆయువు పట్టుగా నిలుస్తుంది. అలాగే ‘జై బోలో తెలంగాణ’ అని టైటిల్‌పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఏక పక్షంగా ఉద్యమాన్ని చూపెడతారని అంతా భావించారు. అదే జరిగింది. కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందే లేదు. వాస్తవంగా జరిగిన ముఖ్యమైన సంఘటనలన్నీ చక్కని కూర్పుతో అల్లడం వల్ల ప్రేమకథ ఫ్లేవర్‌ను కొంత తగ్గించే ప్రయత్నమూ చేసారు. అయతే చరిత్రను సినిమాగా రూపొందించడంలో వాస్తవాల్ని ప్రజల ముందుంచడంలో దర్శకుడు మరికొంత కసరత్తు చేయాల్సింది. బందగీ గోపన్న వంటి అమరుడి గురించి చెప్పినా, తెలంగాణ ఉద్యమం ఎందుకు జరుగుతోందన్నది మరింత లోతుగా చెబితే బావుండేది. ఏవీఎస్, జనార్ధన్ మహర్షి కామెడీ ట్రాక్ నవ్వులు కురిపించింది. అక్కడక్కడ కె.సి.ఆర్‌ను చూపి ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని కలిగించారు. తెలంగాణ సంస్కృతిని, ఉద్యమాన్ని అగ్రభాగాన నిలుపుతూ, ప్రజల మనోభీష్టాలకు అద్దం పట్టిన ఈ చిత్రాన్ని తెలంగాణా అభిమానులకేకాక, అందరికీ నచ్చే విధంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు శంకర్ తను అనుకున్నది సాధించినట్లయింది.
నటుల్లో ప్రధాన పాత్ర వేసిన జగపతిబాబు కనిపించింది కొద్ది సమయమైనా, తన ముద్ర వేయగలిగాడు. ఈ క్యారెక్టర్ ఆయన కెరీర్‌కి ఎంతవరకు ఉపయోగపడుతుందనే దానికన్నా, ఈ సినిమాకి మాత్రం జగపతిబాబు కచ్చితంగా వెనె్నముకలా నిలబడ్డారనేది నిజం. సందీప్, మీరానందన్, స్మృతీఇరానీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. గద్దర్ ఒక్క పాటైనా చిత్రం ముగింపు వరకు వెన్నాడేట్లు కనిపించి ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని కలిగించాడు. చిత్రంలోని కొన్ని ఫ్రేమ్‌లు గత కొంత కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు గుర్తుకు వచ్చి కళ్లు చెమర్చేలా చేస్తాయి.
చక్రి సంగీతంలోని పాటలన్నీ బాగా కుదిరాయి. పాటలు రాసింది ఉద్ధండులైన ప్రజాకవులు కావడంతో పాటల్లో మాటలు తూటాల్లా పేలాయ. ముఖ్యంగా అందెశ్రీ రాసిన ‘జైబోలో తెలంగాణ’, నందిని సిద్ధారెడ్డి ‘ఒక పువ్వు ఒక నువ్వు ఉయ్యాల లూగేనా...’, గద్దర్ రచించి ఆడి పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా...పోరు తెలం గాణమా..కోట్లాది ప్రాణమా..’ బాగా ఆకట్టుకున్నాయ. వీరికి తోడు కెసిఆర్ రాసిన ‘జగారడీ చేస్తుండ్రు..గడిబిడి చేస్తుండ్రు..’ పాట ఆయన స్టయల్‌లోనే సాగింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఓకే. డైలాగులు కొన్ని చోట్ల బాగా పేలాయి. ‘తెలంగాణ కోసం ఎన్ని స్విచ్‌లు నొక్కినా ఫలితం లేదు. ఢిల్లీలో కరెంట్ లేదుగా’, ‘కలిసి ఉందా మనుకున్న మమ్మల్ని విడదీస్తున్నారు... విడిపోతాం అంటున్న తెలంగాణాను మాత్రం కలిసి ఉండాలంటు న్నారు. ఇదేం న్యాయం?’ లాంటి డైలాగులకు ప్రేక్షకుల్లో ఈలలే ఈలలు. చప్పట్లే..చప్పట్లు మొత్తానికి దర్శకుడు ఎన్.శంకర్ తాను ఎందుకోసం ఈ చిత్రం తీసాడో, ఆ ధ్యేయం నెరవేరినట్లే.
-md abdul

అలా కొత్త నీరు మొదలైంది

అలా... కొత్తనీరు మొదలైంది!
-ఎం.డి.అబ్దుల్
March 10th, 2011

‘తుపాను రాలేదు...కనీసం చిరు జల్లులు కూడా పడలేదు...కానీ కొత్తనీరు పరవళ్లు తొక్కుతూ అందరినీ పరవశింపచేస్తూ వచ్చేసింది’ అయితే అది నదుల్లోకి కాదు... తెలుగు సినీ పరిశ్రమలోకి. కొత్త ఆలోచనలతో..సరికొత్త కథాంశాలతో...నిశ్శబ్దంగా మొదలుపెట్టి అణు విస్ఫోటనం కావించే రీతిలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు కొత్త దర్శకులు. తమదైన కొత్త శైలితో సరికొత్త సినిమాను తెలుగు తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. అయితే వీరిలో కొందరు కానె్సప్ట్‌పరంగా నవ్యత చూపించినా తెలుగు ప్రేక్షకుడి నాడిని పట్టుకోలేక బోల్తాపడ్డారు. మరికొందరు మాత్రం అటు విమర్శకుల ప్రశంసలను పొందడమే కాక బాక్సాఫీసుకు కలెక్షన్లతో విందుభోజనం పెట్టి విజయకేతనం ఎగరేశారు. వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న తెలుగు సినిమాను కొద్దో గొప్పో రక్షించే ప్రయత్నం చేసిన వీరి విజయానికి దోహదం చేసిన అంశాలేమిటి...ఎక్కడుంది వీరి సక్సెస్ సూత్రం...అనేది పరిశీలిస్తే కొన్ని వాస్తవాలు కళ్లెదుట ప్రత్యక్ష మవుతాయి.

ఓ సీనియర్ అసోసియేట్ దర్శకుని దగ్గరకు ఒక కొత్త నిర్మాత వచ్చాడు. రెండు..రెండున్నర కోట్లతో ఓ సినిమా చేద్దామని ప్రపోజల్ పెట్టాడు. అయితే ఆ అసోసియేట్ దర్శకుడుకి ఆ నిర్మాత కొద్దిగా కూడా ఆనలేదు. ఆ నిర్మాత చెప్పిన బడ్జెట్ మొత్తం తన హీరో పారితోషికంలో సగం కూడా లేదని పొమ్మని, తన కొత్త ఫైల్‌లో పాత కథను పట్టుకుని హీరోకి కథ వినిపించడానికి బయలుదేరాడు. సినిమా అంటే మినిమం ఎంత లేదన్నా పదిహేను నుంచి ఇరవై కోట్లు ఉండాలనేది అతను తను అప్రెంటీస్‌గా పనిచేసినప్పటినుంచీ నేర్చుకున్న పాఠం. అయితే తన గురువు కూడా మొదట చిన్న సినిమాతోనే కెరీర్ మొదలుపెట్టి తర్వాత పెద్ద దర్శకుడు అయ్యాడన్న సంగతి మరిచిపోయాడు. కెరీర్ మొదట్లోనే రాజవౌళికి పోటీ ఇవ్వాలి, వి.వి.వినాయక్‌ని పడగొట్టాలి, ఎన్‌టిఆర్‌తోనో, ప్రభాస్‌తోనో సినిమా చేయాలనేది అతని జీవితాశయం. తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి తోడుగా ‘ఆస్కార్’ రెహమాన్ లాంటి పెద్ద సంగీత దర్శకుడు, శ్రీకర్ ప్రసాద్ లాంటి ఎడిటర్, పి.సి.శ్రీరామ్ లాంటి కెమెరామెన్ ఉండాలని కోరిక. అంతేకానీ తనలాగే కొత్తగా ట్రై చేస్తున్న వారు పొరపాటున కూడా తన సినిమాకు పనికిరారని ఫిక్సయి కలల్లో తేలుతూ ఖాళీగా తిరుగుతుంటాడు. ఈ అందమైన ఊహని బ్రేక్ చేసి కాస్త వాస్తవంలోకి వచ్చి స్క్రిప్టుని, తమని మాత్రమే నమ్ముకుని రంగంలోకి దూకినవారే విజేతలుగా నిలిచారు. ఆ విజేతలే తమ తదుపరి సినిమాకు ఆ అసోసియేట్ దర్శకుడు అనుకున్న పెద్ద ఛాన్స్ ( పెద్దహీరో, పెద్ద బ్యానర్, పెద్ద బడ్జెట్)లను వరిస్తున్నారు.
క్రితం సంవత్సరం నవంబర్‌లో వచ్చిన ‘ఏమైంది ఈ వేళ’ దర్శకుడు సంపత్ నంది విషయాన్ని తీసుకుంటే...అతను అప్పటికి వరస ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ సందేశ్ హీరోగా సినిమా తీసారు. ఓపెనింగ్స్ కూడా కష్టమనుకునే స్థితిలో విడుదలైన ఈ చిత్రం కొద్దిరోజులకే అందరి దృష్టినీ ఆకర్షించి మంచి విజయాన్ని సాధించింది. అమీర్‌పేట సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో యువతను దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ చిత్రం వారి మనస్సులను గెలిచింది. యువత మనస్సులోని కన్ఫూజన్‌ని క్లారిటీగా వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో చెప్పినందుకు ఈ విజయం దక్కింది. విడుదలైన రెండు వారాలకే ప్రింట్ల సంఖ్య రెట్టింపు చేసుకుని నమ్మి అవకాశమిచ్చిన ప్రొడ్యూసర్‌ని ఆర్థికంగాను ఆనందపరచగలిగింది. అంతేకాక ఆ దర్శకుడికి రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోతో సినిమా చేసే అద్భుతమైన ఛాన్స్‌ని తెచ్చిపెట్టింది. ఇది కేవలం బడ్జెట్ పరిమితుల్లో హిట్ సినిమా తీయగలిగే నైపుణ్యానికి దక్కిన బహుమానం. ఇక సంక్రాంతి సీజన్ అనంతరం విడుదలై...ఘనవిజయం సాధించిన మరో చిన్న బడ్జెట్ చిత్రం ‘అలా మొదలైంది’. ఈ సంవత్సరం డీసెంట్ హిట్‌గా చెప్పబడుతున్న ఈ చిత్రం ఓ మహిళా దర్శకురాలు (నందినీరెడ్డి) వెండితెరపై ఆవిష్కరించిన కొత్త తరహా రొమాంటిక్ కామెడీ. ‘అష్టాచెమ్మా’ తర్వాత ఒక్క హిట్టు కూడా లేని నానిని హీరోగాపెట్టి కొత్తమ్మాయి నిత్యామీనన్‌ని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ రూపొందిన ఈ చిత్రం..సినిమా విజయవంతం కావాలంటే కావాల్సింది పెద్దబడ్జెట్, క్రేజీ కాంబినేషన్ కాదని కేవలం కథా, కథనాల్లో కొత్తదనం, దానిని తెరకెక్కించే తీరులో వైవిధ్యం ఉంటే చాలని నిరూపించింది. తెలుగు సినీ పరిశ్రమలో మహిళా దర్శకులు అంతరించిపోతున్న తరుణంలో వారి ఉనికిని నిలబెట్టగలిగింది. అందులోను మహిళా దర్శకుల సినిమాలంటే కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్, రీమేక్‌లనే కాకుండా యువతరం ఆనందించగలిగే సినిమాలు కూడా రూపొందించగలరని నిరూపించింది. అంతేకాక రొమాంటిక్ కామెడీల వైపు పరిశ్రమ దృష్టిని మరల్చేలా చేసింది. ఈ సినిమా విజయం ఆమెకు బెల్లంకొండ సురేష్‌లాంటి పెద్ద నిర్మాతతో సినిమా ఆఫర్‌ని తెచ్చిపెట్టేలా చేసింది. సమంత, సిద్ధార్ధ కాంబినేషన్‌లో ఆమె తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టింది. చిన్న సినిమాతో మొదలుపెట్టిన ఆమె ప్రస్థానం రెండో అడుగుకే పెద్ద సినిమావైపుకు మరలింది. ఎల్.బి.డబ్ల్యు (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) అంటూ టైటిల్‌లోనే వైవిధ్యం చూపిస్తూ మనముందుకొచ్చిన మరో దర్శకుడు ప్రవీణ్ సత్తార్. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించకున్నా, పరిశ్రమలో పెద్దల దృష్టిని ఆకర్షించింది. కళ్లెం లేని గుర్రాల్లాంటి యువకుల మనస్సులను ప్రతిబింబిస్తూ...వారి స్నేహాలు, ఆకర్షణలూ, ప్రేమలూ సఫలం అయినా కాకున్నా మంచి అనుభూతులుగా ఎలా మిగిలిపోతాయా చెప్పిన ఈ చిత్రం ఓ వర్గాన్ని బాగానే ఆకర్షించింది. తెలుగులోను మల్టీఫ్లెక్స్ సినిమాకు ఓ ఊపుని తెచ్చే ప్రయత్నం చేసిందీ చిత్రం. బెల్లంకొండ సురేష్ లాంటి అనుభవం ఉన్న పెద్ద నిర్మాత ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకుని తాను స్వంతంగా ప్రింట్లు పెంచుతానని ప్రకటించడమే ఈ చిత్రదర్శకుడు సాధించిన విజయమని చెప్పాలి. సృజనాత్మకతే నిజమైన పెట్టుబడి అని నిరూపించిన ఈ దర్శకుడు నుంచి మరిన్ని మంచి చిత్రాలు వస్తాయనడంలో సందేహం లేదు.
‘అహనా పెళ్లంట’ అంటూ పాత టైటిల్‌తో వచ్చిన నూతన దర్శకుడు వీరభద్రమ్. పాతికేళ్ల లోపు వాళ్లే సినిమా ప్రేక్షకులు అని నమ్మకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం చేసి సఫలీకృతుడయ్యాడు. ‘అల్లరి’ నరేష్‌తో రెగ్యులర్ కామెడీ కాకుండా లవ్‌స్టోరీని కూడా మిక్స్‌చేసి నవ్విస్తూనే ఆహ్లాపరచగలిగాడు. అనుభవం, పరిచయాలు చాలా ఉన్నా తన మొదటి సినిమాకు ఏ పెద్ద హీరోనో అనుకోకుండా కేవలం తన టాలెంట్ మీద నమ్మకంతోనే అల్లరి నరేష్‌తో చిన్న సినిమా తీసి విజయం సాధించి తన గురువు ఇవివి సత్యనారాయణకు తన తొలి చిత్రాన్ని అంకితమిచ్చి ఆయన ఆశీస్సులు అందుకోగలిగాడు. ఇప్పుడు వీరభద్రమ్ ఓ పెద్ద హీరోతో తన తదుపరి చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఇక రీసెంట్‌గా పరిచయమైన మరికొంతమంది కొత్త దర్శకులు (కుదిరితే కప్పు కాఫీ, ఖర్మ వంటి చిత్రాలు) విజయవంతం కాకపోయినా తమదైన శైలిని, కొత్తదనాన్ని, వైవిధ్యాన్ని ప్రదర్శించారు. వారిలోని తపనను బయటపెట్టగలిగారు. వీరు భవిష్యత్తులో గ్యారంటీగా మంచి చిత్రాలు తీసే అవకాశముందని నమ్మకం కలిగించారు.
ఇదిలావుంటే పెద్ద బడ్జెట్‌లతో, క్రేజీ కాంబినేషన్లతో పరిచయమైన కొత్త దర్శకులు ప్రకాష్ కోవెలమూడి (అనగనగా ఒక ధీరుడు), బి.వి.ఎస్.రవి (గోపీచంద్ వాంటెడ్) మన ముందుకు వచ్చి చతికిలపడ్డారు. వీరి సినిమాలు భారీ బడ్జెట్, క్రేజీ కాంబినేషన్‌లు అంటూ కేవలం ప్రచార ఆర్భాటాలతో ఓపెనింగ్స్ రాబట్టగలిగినా కథ, కథనాలు సరిగ్గా లేక విజయం అందుకోలేకపోయారు.
కొత్తగా పరిచయమవ్వాలనుకునే దర్శకులు పెద్దబడ్జెట్, పెద్ద హీరోలే కావాలని పట్టుపట్టకుండా తమలోని సృజనాత్మకతను తెలియపరచడానికి చిన్న బడ్జెట్ చిత్రాన్నైనా చేసి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే వారు కోరుకున్న బ్యానర్స్, హీరోలు వారి దగ్గరకు వస్తారనేది పైన చెప్పుకున్న దర్శకులు నిరూపించిన సత్యం. అలాగే చిన్న సినిమావల్ల పరిశ్రమ సంక్షోభంనుంచి తప్పించుకుంటుంది. పరిశ్రమలో అందరికీ పని దొరుకుతుంది.
ఇక ఇప్పటికే నిరూపించుకున్న కొత్త దర్శకులు వారి కొత్తదనాన్ని, సృజనను కేవలం మొదటి చిత్రానికే పరిమితం చేయకుండా ప్రతి చిత్రంలోను ప్రదర్శిస్తారని కోరుకుందాం.
గమనిక: పైదంతా చదివి చిన్న బడ్జెట్‌తో వచ్చిన సినిమాలన్నీ కొత్త ఆలోచనలతో ఉంటాయనుకుంటే సూపులో కాలు వేసినట్టే... *