Thursday, August 4, 2011

తమాషా కార్నర్

‘సెగ’ తగిలింది!

యువస్టార్ నాని నిర్మాతలతో ‘అష్టాచెమ్మా’ ఆడుకుంటున్నట్టుంది. అవును మరి, కాలం కలిసి వస్తే కావలసిన వాళ్లు కోన్‌కిస్కా అయిపోతారు. ఏ ముహూర్తాన ‘ఈగ’వచ్చి తన మీద వాలిందో, నిర్మాతలు దోమలై పోతున్నారు. ‘అలా.. మొదలైంది’వరకూ తన సినిమాల బడ్జెట్ మూడు కోట్లలోపే. దీన్ని ఎస్.ఎస్.రాజవౌళి ‘ఈగ’తో పది కోట్లకి పెంచినట్టు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నాని పదికోట్లకి తక్కువ బడ్జెట్ సినిమా చెయ్యనంటున్నాడు. అబ్బాయికి మంచి మార్కెట్ వుంది. చిన్న నిర్మాతలకి చేతులనిండా కలెక్షన్లు తెచ్చిపోస్తాడనుకుని కులుకుతూ వెళ్తే, తేరుకోలేని షాకిస్తున్నాడు. సరే, బడ్జెట్లగోల అలా వుంచితే, తాజాగా పారితోషికాల పరేషానీ తెచ్చాడని చెప్పుకుంటున్నారు ఫిలింనగర్లో. విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘అలా...మొదలైంది’కి 20 లక్షలు తీసుకుంటే, ‘ఈగ’కి 50 లక్షలు ముట్టాయి. అయితే ఎప్పుడైతే ‘అలా..మొదలైంది’ హిట్టయిందో, ఇక కోటి కావాలని కంగారు పుట్టించేస్తున్నాడు. తాజాగా విడుదలైన ‘సెగ’ పరాజయంతో అబ్బాయికి భలే ‘సెగ’తగిలిందని, ఇక దిగి వస్తాడని అందరూ అనుకుంటున్నారు.

లైను చెబితే పిచ్చోడు!
స్క్రిప్టుమీద ఆరునెలలు కూర్చున్నాం, పది నెలలు పడుకున్నాం అని తరచు పరిశ్రమలో స్టేట్‌మెంట్లు విన్పిస్తుంటాయి. ఇవి దర్శకులో, నిర్మాతలో చెప్పే మాటలు. ఇవన్నీ స్టార్స్‌తో ‘లైను’ ఓకే చేయించుకున్నాక చేసే పనులు. ముందు లైను, తర్వాత కథమీద యోగాసనాలు వేసే పద్ధతి చాలా కాలంగా అమల్లో వుంది. ఇంతలో కొందరు స్టార్స్‌కి ఏమైందో ఏమోగానీ-లైను కాదు, పూర్తి స్క్రిప్టుతో రావాలని ఫర్మానా జారీ చేస్తున్నారు. జూనియర్ ఎన్‌టిఆర్‌తో, రవితేజతో ఈ అనుభవాలే ఎదురయ్యాక కొందరు టాప్ డైరెక్టర్లు కంగుతిని వెనక్కిపోయారు. లైను చెప్పేసి స్టార్ డేట్లు ఈజీగా సంపాదించే సరదా ఆటకి బ్రేకుపడి, ముందే స్క్రిప్టుమీద కూర్చుని, పడుకుని, తిప్పలుపడి ఆ కష్ట ఫలితంతో స్టార్ సుముఖానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చి పడింది. పవన్‌కళ్యాణ్‌తో కూడా ఈ ముందస్తు కాయకష్టం తప్పడంలేదని వినికిడి. ఈ స్టార్లు ఏడాదికో సినిమా పద్ధతికి పాల్పడుతున్నప్పుడు ‘లైను’మీద లైనుకి రావడం కుదిరింది గానీ, ఇప్పుడు ఏడాదికి మూడు సినిమాల స్క్రీముకి తెరతీస్తున్నందున, వెంట వెంటనే ఫుల్‌స్క్రిప్టులవసరం. అప్పుడే ఫుల్ భోజనం దర్శకులకి. లేకపోతే ఆకలి దప్పులతో ఫిలింనగర్ వీధుల్లో ‘‘ఆకలై లైను చెబితే పిచ్చోడన్నారు స్టార్లు’’ అని పాడుకోవడమే!

టాలీఫుడ్డేమిటి?
ఈ ప్రశ్న అమాయకులు వేస్తారు. టాలీవుడ్‌లో ఏం ఫుడ్ తింటారంటే, అనేక మంది ధవళకాంతులీనే హోమియోపతీలాంటి చిన్న చిన్న పాలిథిన్ పొట్లాల్లో లభించే కొకైన్ తింటారని గత సంవత్సరకాలంగా మీడియా కోడై కూస్తోంది. ఒక గ్రాము మూడు వేల రూపాయలు. తాజాగా నల్ల జాతీయుల నుంచి ఈ తెల్ల పదార్థం తను శాయశక్తులా ముట్టుకోలేదని యువస్టార్ ‘వరుణ సందేశ’ మిచ్చాడు. కావాలంటే రక్తదానానికి-సారీ రక్త పరీక్షకి రెడీ అంటున్నాడు. తను బాక్సాఫీస్ పరీక్షకి సరిగ్గా ఎదురొడ్డి నిలబడి వుంటే ఈ రక్త పరీక్ష విషమ పరిస్థితి వచ్చేదికాదు. తొమ్మిదిలో ఆరు సినిమాలు ఫ్లాపయి మార్కెట్ పోగొట్టుకున్నది చాలక, డ్రగ్ కేసులో ఇరుక్కుంటే హ్యాపీడేస్, కొత్తబంగారులోకం వేలం వెర్రి అభిమాన ప్రేక్షకులకి ఏం సందేశమిస్తున్నట్టు. ‘కుర్రాడు’లో భూస్థాపితమైన మోటార్ సైకిల్ కోసం పోరాటం చేసినట్టు, ఇప్పుడు ఎనె్నన్ని సాక్ష్యాల్ని భూస్థాపితం చేయాలి...హీరోయిజం వికటిస్తే రేపు పోలీసుల పాలీగ్రాఫ్ యంత్రాన్ని కూడా అపహరించుకుపోవాల్సి రావచ్చు. తను రక్తపరీక్ష అంటుంటే, పోలీసులు పాలీగ్రాఫ్ పరీక్ష కోసం కోర్టుకెళ్లారు. అలాగే దానికి తగిన భద్రత కోసం కూడా అర్జీపెట్టుకుంటే మంచిదేమో! *

No comments:

Post a Comment