Thursday, August 11, 2011

తమాషా కార్నర్

‘అయ్యారే...’ శివాజీ!

కాషాయ వస్తధ్రారి నిత్యానందస్వామి నీలి చిత్రాల క్రేజీనటుడయ్యాక, ఆ క్రేజ్‌ని వెండితెరమీద సొమ్ము చేసుకోవాలని ‘అయ్యారే’ తీశారు నిర్మాతలు. నిత్యానంద కోర్టుకెళ్లి స్టేయ్యారే అన్నాడు. స్టే వచ్చింది. సినిమా ఆగిపోయింది. తిరిగి ఎన్నాళ్లకో విడుదలవుతోంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని హీరో శివాజీ అసభ్యశ్రీ అవార్డు పుచ్చుకుందామని టీవీ ప్రేక్షకుల సాక్షిగా ముద్దు ముద్దుగా ముచ్చటగా బూతైన మాటలతో నిత్యానందలహరిలో తేలిపోయాడు. ఎదవ అన్నాడు నిత్యానందని. ఎవరూ వన్స్‌మోర్ అనకున్నా పదే పదే అన్నాడు. ఇంకేదో రాయడానికి వీల్లేని మాటని తనివితీరా అన్నాడు. లోకమంతా షాకై చూస్తోంది. నిత్యానంద నీలి దృశ్యాలకన్నా ఇదే అఫెన్సివ్‌గా ఉంది. సినిమాని ఆపే హక్కు నిత్యానందకి లేదట. సినిమా కోర్టు కదా ఆపింది. నిత్యానంద నీచుడైనంత మాత్రాన అతడికి హక్కులుండవనా శివాజీ భావం? నిత్యానంద లీలల్ని టీవీలో చూసి ఇన్‌స్పయిరై సినిమాలో నటించి శివాజీ, ఇప్పుడదే తను పేల్చిన అసభ్య పదజాలాన్ని నిత్యానంద టీవీలో చూసే ఉంటాడు. అతను శివాజీమీద ఇంకో సినిమా తీస్తే? దాని షూటింగ్ కోర్టులో జరిగితే?

తమిళ ముప్పు!
తమిళ హీరోలు తెలుగు వాళ్ల మధ్యకొచ్చి ప్రెస్‌మీట్లుపెట్టి తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకుంటూ క్రేజ్ పెంచుకోవడం తెలుగు స్టార్ల కొంప ముంచబోతోందా? సూర్య, విక్రమ్, కార్తీ లాంటి తమిళ స్టార్స్‌కి ఇప్పటికే తెలుగులో తెగ ఫాలోయింగ్ ఉంది. ఫాలోయింగ్ లేకపోయినా తమిళ దర్శకులు, ఇతర టెక్నీషియన్లు తెలుగు ఫీల్డులో చొరబడుతూ తెలుగు దర్శకులకి, టెక్నీషియన్స్‌కి గుబులు పుట్టిస్తున్నారు. దీనిమీద సినిమా కథ దగ్గరనుంచీ విడుదల వరకు తాము ఆడింది ఆటగా సాగించుకునే తెలుగు స్టార్లెవరూ స్పందించలేదు. ఇప్పుడు వాళ్ల నెత్తిమీదకే వచ్చింది. ఈ తమిళస్టార్లు ఏవో డబ్బింగులతో క్రేజ్ పెంచుకుంటున్నార్లే అని సరిపెట్టుకుంటున్న తెలుగుస్టార్లు-ప్రత్యేకించి యువస్టార్లు అమాంతం పరస్పరం ఆరాలు తీస్తూ బేజారెత్తుతున్నారు. కారణం, ‘నాపేరు శివ’తో మళ్లీ వచ్చిన తమిళస్టార్ కార్తీ తెలుగులో నటిస్తాననడం! దీనికో నిర్మాతా ముందుకు రావడం! ఇక తమిళస్టార్లు తెలుగులో నటించేస్తే ఇంకేమైనా ఉందా...తెలుగులో వారసత్వాలతో వచ్చిన యువస్టార్లని తప్పించి మరే కొత్త మొహం చూసి తరించే ఛానే్సలేదు. వారసేతర కుర్రాడు స్టార్‌గా ఎదిగే స్కోపే లేదు. కానీ పక్కరాష్ట్రం నుంచి అమాంతం వెరైటీగా క్రేజ్ ఉన్న స్టార్ వచ్చేస్తే? ఇదిప్పుడు యువస్టార్లకి కంగారు పుట్టిస్తోందని ఫిలింనగర్ సమాచారం. ఏదో తప్పుచేస్తూంటేనే కంగారు పుట్టుకొస్తుంది...మూసపాత్రలతో మూస సినిమాలే లోకంగా జీవించడం తప్పే కదా? తమిళ స్టార్ వచ్చేసి ప్రయోగం చేస్తే, తెలుగు ప్రేక్షకులకి ఇష్టంగా వడ్డిస్తున్న పాత చింతకాయ సినిమాలేమైపోవాలి? మూసకి ఈ అన్యాయం జరగాల్సిందేనా! ఇక జీవించడమెలా టాలీవుడ్ తల్లీ?

ఇక డైలాగులు విడుదల!
సినిమా విడుదలవుతోంది. సినిమాకంటే ముం దు టైటిల్‌లోగో విడుదలవుతోంది. తర్వాత పాటలు విడుదలవుతాయి. ఆ తర్వాత ఫస్ట్‌లుక్ అంటూ కొన్ని ఫోటోలు ఫ్యాన్స్ మొహాన పడేస్తారు. స్ప్లెండిడ్,
టెర్రిఫిక్, అదరగొట్టాడు అని స్టార్ ఫోజుల్ని చూసి మురిసిపోతారు ఫాన్స్. పోస్టర్ విడదలవుతుంది. వారెవ్వా అనుకుంటారు. అసలు లోగో విడుదలైనప్పుడు ఈ టైటిల్ డిజైన్ గురించే సినిమా ఎలా ఉండబోతోందో గంటలకొద్దీ చర్చించుకుంటారు. ఇక ఫొటోల తర్వాత టీజర్లు-అంటే ట్రయిలర్స్ అనే వాడుకలో ఉన్న పేరుగా స్టయిలుగా పెట్టుకున్న కొత్త పేరు- విడుదలవుతాయి. ఫస్ట్ టీజర్ విడుదల చేసి, రెస్పాన్స్ చూసి, దానికి మించిన సెకండ్ టీజర్ రిలీజ్ చేస్తారు. ఇందులో అభిమాన స్టార్‌ని చూసి ఫుల్ రేంజిలో రెచ్చిపోతారు. ఈ టీజర్స్‌లో ఒక పంచ్ డైలాగ్ ఉంటుంది. అదే మెయిన్ ఎట్రాక్షన్. టీజర్ల పేరుతో పంచ్ డైలాగులు వినిపించడమే అసలు ఉద్దేశం. అలా ఫస్ట్ టీజర్‌తో ఒక డైలాగు పాపులర్ అయ్యాక, సెకండ్ టీజర్‌లో ఇంకోటి వదులుతారు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్‌బాబు ‘దూకుడు’టీజర్లతో జరుగుతున్నదిదే. ఫస్ట్ టీజర్‌లో ‘మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లయిండ్‌గా వెళ్లిపోతా’ అని పంచ్ ఇచ్చుకున్నాడు ప్రిన్స్. మొనే్న విడుదల చేసిన సెకండ్ టీజర్‌లో ‘్భయానికి మీనింగే తెలీని బ్లడ్‌రా నాది’ అని పంక్చర్ చేశాడు. రాష్ట్రంలో నేలమీద ఉండే కామన్ అభిమానులని అలా ఉంచుదాం, ఇంటర్నెట్‌లో ఉండే ఎక్కడెక్కడి దేశాల నెటిజనులూ ఈ డైలాగులకి తెగ రెచ్చిపోతున్నారు. ఇలా లోగో దగ్గరనుంచీ డైలాగుల వరకూ రెచ్చగొట్టుకుంటూ వచ్చిన నిర్మాతలు తీరా సువిశాల వెండి తెరమీద ఏంచేస్తారో, ఏం తేలుస్తారో తెలీదు! షోలే, ముత్యాల ముగ్గు డైలాగుల్లాగా చరిత్రలో వాటికంటూ ఓ స్థానం రికార్డుల రూపంలో ఉంటుందో లేదో తెలీదు. వెయ్యి థియేటర్లలో రెండు వారాల తర్వత ఈ హడావుడి అంతా సద్దుమణిగి, దులుపుకుని వెళ్లిపోతారు.

No comments:

Post a Comment