Friday, July 29, 2011

పందెం నెగ్గని పుంజు!

md abdul

* కోడిపుంజు (బాగోలేదు)
తారాగణం:
తనీష్, శోభన
రోజా, శివకృష్ణ
శ్రీధర్, ఎమ్మెస్ నారాయణ
రాజ్యలక్ష్మి, సత్యప్రకాష్
రాళ్లపల్లి తదితరులు.
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: శివకుమార్
నిర్మాణం:
శ్రీ శైలేంద్ర సినిమాస్
నిర్మాత: ఎస్.ఎస్.బుజ్జిబాబు
దర్శకత్వం: బి.వి.వి.చౌదరి

ఓ నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించే తీరిక నేటి తరానికి లేదు. నచ్చింది చేసేస్తారు. కొన్ని సార్లు పంతాలకు పోయి ఇబ్బందుల్లో పడతారు. కానీ అన్నిసార్లు చేతులు కట్టుకుని కూర్చోవడం కుదరదు. ఆవేశంతో అడుగేస్తేనే లక్ష్యాలు నెరవేరతాయి. అనుకున్న లక్ష్యం కోసం పందెం ‘కోడిపుంజు’లా తెగువ చూపిన కుర్రాడి కథే ఈ చిత్రం. తెలుగు సినిమాని గత ఏడాది కాలంగా పరిశీలిస్తే విడుదలవుతున్న సినిమాలు ఏ మేరకు సొమ్ములు తీసుకొస్తున్నాయి అని ప్రశ్నించుకుంటే సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎక్కువ శాతం పరాజయానే్న చవిచూస్తున్నాయి. లాజిక్కులేని కథలు, మూస ధోరణిలో సన్నివేశాలు, నవ్వించని కామెడీ ట్రాకులు, కొత్తదనం పేరుతో విపరీత ధోరణులు...ఇవి ప్రేక్షకుల పాలిట శాపంగా మారుతున్నాయన్నది చిత్రసీమ మీద ఒట్టేసి చెప్పే నిజం. తెలుగు సినిమాలో కథ అనేది బ్రహ్మపదార్థం. అది వుంటే వుంది అనుకోవాలి. లేదు అంటే లేదు అనుకోవాలి. సరిగ్గా ఇదే జరిగింది ఈ ‘కోడిపుంజు’ విషయంలో.
కథలోకి వెళితే...తండ్రికి తగ్గ తనయుడు అనే మాట విన్నాం. కానీ తల్లికి తగ్గ తనయుడనేది మనం చాలా తక్కువ విన్నాం. ఈ కోవకి చెందిన యువకుడే అభిమన్యు (తనీష్). తల్లి దగ్గుబాటి సీతారత్నం (రోజా)గారి అబ్బాయి అంటే చాలు. తల్లి చూసి రమ్మంటే పీకి వచ్చే రకం. తల్లి నుంచి వారసత్వంగా ఆస్తితో పాటు కావలసినంత పొగరు వచ్చింది. కొడుకుతో తొడగొట్టించి మరీ కయ్యానికి పంపే ఘటికురాలు సీతారత్నం. పెద్ద కత్తి సంచిలో పెట్టుకుని మోపెడ్ మీద తిరుగుతుంటుంది. తేడా వస్తే కత్తితో తిరగబడుతుంది. సీతారత్నం భర్త వ్యవసాయంలో నష్టమొచ్చి ఆత్మహత్య చేసుకుంటే, తనే వ్యవసాయధారిణిగా మారి రెండు ఎకరాలని ఇరవై ఎకరాలు చేసింది. కొడుకుని మంచి చదువులు చదివించి మంచి ప్రయోజకుడిని చేసింది. ఇలా వుంటే తూర్పుగోదావరి జిల్లాలో ‘రామరాజు లంక’ అనే గ్రామం. ఆ గ్రామ ప్రెసిడెంట్ రామచంద్రరావు (శివకృష్ణ) దాన ధర్మాలలో అందె వేసిన చేయి. ఆ విషయంలో ఎంతో పేరు సంపాదిస్తాడు. తన ఐదు వందల ఎకరాలని యాభై ఎకరాలు చేశాడు. పెద్ద కూతురు పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైతే, చిన్న అమ్మాయి నందిని (శోభన) ఇక్కడే చదువుకుంటోంది. అదే గ్రామంలో రామచంద్రరావు కుర్చీ మీద కనే్నసి వున్నాడు అల్లూరి బాపీనీడు (సత్యప్రకాష్). ఇతని తమ్ముడు నాగినీడు రామచంద్రరావు కూతురి మీద కనే్నశాడు. ఒకానొక సమయంలో నందినీని టీజ్ చేసిన నాగినీడుని వీరబాదుడు బాదుతాడు అభిమన్యు. ఆ సమయంలో అతడి కండ బలం చూసిన నందిని అతడి ప్రేమలో పడుతుంది. ఈ విషయంలో నాగినీడుతో చాలా సమస్యలు వస్తాయి. అతను దగ్గరవ్వడం, అతన్ని క్షమించి అభిమన్యు తన గ్రూపులో చేర్చుకోవడం ఆమెకి నచ్చదు. అయితే అభిమన్యు-నందినీల ప్రేమ ఇటు సీతారత్నంకి, అటు నందిని తల్లి (రాజ్యలక్ష్మి)కి తెలిసిపోతుంది. పిల్లల ప్రేమను కాదనలేక ఎంతో సంతోషంతో ఇద్దరూ అంగీకారం తెలుపుతారు. ఓ రోజు శ్రీరామనవమి సందర్భంగా నందినితో అభిమన్యు పందెం కాసి, ఆ దరిమిలా ఆమె తండ్రి కంటపడిపోతాడు. తన కూతురితో అతడి ప్రవర్తనకి మండిపడి అభిమన్యు తల్లి సీతారత్నం క్యారెక్టర్‌పై కూడా నిందారోపణలు చేస్తాడు. ఈ ఆరోపణలకు ఆవేశం ఆపుకోలేని అభిమన్యు ఆత్మాభిమానం దెబ్బతిని ‘మీ కూతుర్ని తన వశం చేసుకుంటా. ఎన్నికలలో నవ్వు పరాజయం పొందేలా చూసి నీ పరువుతీస్తా’ అని సవాల్ విసురుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే అసలు సిసలైన ‘కోడిపుంజు’ క్లైమాక్స్.
ఈ సినిమాని పూర్తి మాస్ అనుకుని చూస్తే సగం వరకే అలాంటి అనుభూతి కలుగుతుంది. దర్శకుడు బి.వి.వి చౌదరి ఎంచుకున్న కథలో కొత్తదనం ఏమీ లేకపోగా, చూసే ప్రేక్షకులకు విసుగుపుట్టించింది. సినిమాల్లో ఓ సూత్రం వుంది. కొత్త కథను అర్థమయ్యేలా చెప్పాలి. పాత కథను కొత్తగా చెప్పాలి. ఇది చాలా వరకు ఫలితాన్నిచ్చే సూత్రమే. ఎందుకంటే మన దర్శకులు చాలా వరకూ పాత కథల్నే వండిస్తూ తాళింపు, మసాలాల్లో చూపే తేడా వల్లే ప్రేక్షకులు కూసింత కొత్త దనాన్ని ఫీలవుతుంటారు. కానీ ఈ ‘కోడిపుంజు’లో ఆ కొత్తదనం మచ్చుకైనా కనిపించదు. ‘దమ్మున్నోడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన చౌదరి ఈ ‘కోడిపుంజు’ని పందెం నెగ్గేలా తీర్చిదిద్దలేకపోయాడు. రొటీన్ కథనే తీసుకున్నా, అందులో అతడి ప్రతిభని ఏ మాత్రం చూపించలేకపోయాడు. కాలం చెల్లిన కథే అయినా దాన్ని తీర్చిదిద్దడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. చిత్ర ప్రథమార్థంలోతెచ్చిన టెంపోని దర్శకుడి ద్వితీయార్థంలో చూపించలేక చతికిల పడ్డాడు. విశ్రాంతిలో హీరో చేసిన ఛాలెంజ్‌లు ద్వితీయార్థంలో పూర్తిగా మరచిపోయారు. దీంతో కథంతా గజిబిజిగా సాగి ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించింది.
ఇక నటీనటుల విషయానికొస్తే...లవర్‌బాయ్ ఇమేజ్‌ను వదిలి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలన్న తపనతో బాడీని విపరీతంగా పెంచేసుకుని స్థూలకాయుడిలా మారిపోయిన తనీష్ తన పాత్రకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఎమోషనల్‌గా వుంటూనే సీతారత్నంలా రోజా అభినయం మెచ్చుకోతగ్గది. ఇలాంటి పాత్రలు ఆమెకు అతి సులువైనవే. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. కొత్తనటి శోభన సోసోగానే చేసింది. ఎక్స్‌ప్రెషన్స్ ఇంకా బాగా పండించాల్సింది. మిగతా నటీనటుల సంగతి సరేసరి. సంగీతం విషయానికొస్తే అనూప్ రూబెన్స్ బాణీలు అంతగా ఆకట్టుకోలేదు. భాస్కరభట్ల రవికుమార్ రాసిన ‘వాలే వాలే..వయసే వాలే..’ తనీష్, మధుశర్మలపై ఒకే ఒక్క పాట మాస్‌ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకు కెమెరా వర్క్‌ని అందించిన బి.శివకుమార్‌ని మెచ్చుకోకుండా వుండలేం. తన వంతు పాత్రని సమర్థవంతంగా నిర్వహించారు. మాటల విషయానికొస్తే...రోజా కొడుకుతో ‘కమ్మెయ్, చంపేయ్, నరికేయ్ అని నిన్ను కోడిపుంజులా పెంచానని చెప్పడం, కోపంగా వున్న ప్రతీసారి హీరో ‘నా పేరు అభిమన్యు..సన్నాఫ్ దగ్గుబాటి సీతారత్నం’ అని చెప్పడం ఎబ్బెట్టుగా అనిపించింది. ఎడిటింగ్ సోసోనే. మొత్తం మీద ఓ నాసిరకమైన కథను ఎంచుకోవడమేగాక, పసలేని స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల మీదికి వదిలిన ఈ ‘కోడిపుంజు’ పందెంలో ఏ మాత్రం నెగ్గలేకపోయింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తనీష్ కథల విషయంలో ఇకనైనా జాగ్రత్త వహిస్తే బావుంటుంది.

No comments:

Post a Comment